కేంద్ర ప్రభుత్వం ద్రవ్య నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, అమలు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో రుణభారం గణనీయంగా తగ్గిందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు కూడా రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఇదే తరహా విధానాన్ని పాటించాలని సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్య సాకారంలో తమ వంతు పాత్ర పోషించాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
‘ద్రవ్య నిర్వహణ తీరుతెన్నులు అందరికీ ప్రస్ఫుటంగా తెలిసేలా, అత్యుత్తమ జవాబుదారీతనపు ప్రమాణాలను పాటించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తయారీలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను విధించుకుంది. ఫలితంగా కోవిడ్ అనంతరం 60 శాతానికి పైగా ఎగిసిన రుణ, జీడీపీ నిష్పత్తిని తగ్గించగలిగింది. ఇప్పుడిది మరింతగా తగ్గుతోంది’ అని ఆమె తెలిపారు.
కోవిడ్ అనంతరం రుణ,జీడీపీ నిష్పత్తి 61.4 శాతానికి ఎగిసింది. అయితే, ప్రభుత్వ విధానాలతో 2023–24 నాటికి 57.1 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 56.1 శాతానికి తగ్గొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ద్రవ్య నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు!


