
కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే రంగాల్లో ఉపాధిని పెంచేందుకు నైపుణ్య కల్పనపై పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ సూచించింది. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో, 2030 నాటికి 13 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. వివిధ రంగాల మధ్య అంతర్గత అనుసంధానత కల్పించడం ఉపాధి కల్పనపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.
దీనివల్ల 200 శాతం మేర ఉపాధి అవకాశాలను పెంచొచ్చని సూచించింది. తయారీ రంగంలో కార్మికులపై ఆధారపడిన ఉత్పత్తి 44.1 శాతంగా ఉంటుందని.. సేవల్లో కార్మికుల ఆధారితమైనవి 54.2 శాతంగా ఉంటాయని వివరించింది. తయారీ, సేవల పరి మాణాన్ని పెంచడం ద్వారా ఈ రంగాల్లో కార్మికులకు మరింత ఉపాధి కల్పించొచ్చని సూచించింది. 2030 నాటికి భారత్లో 63% ఉద్యోగులకు నైపుణ్యాల పెంపు అవసరం ఉంటుందని అంచనా.
పన్నులు తగ్గించాలి..
కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం అధిక మూలధన వ్యయాలు చేయాలని, పన్నులు తగ్గించాలని ఎన్సీఏఈఆర్ నివేదిక సూచించింది. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలంటూ.. కార్మికులకు శిక్షణ, నైపుణ్య కల్పనపై జాతీయ ప్రమాణాల కార్యాచరణను అమలు చేయాలని పేర్కొంది. భారత్లో తయారీని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎల్ఐ పథకాన్ని ప్రస్తావించింది. అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీని పెంచడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెట్టిందంటూ.. ఇందుకు అధిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
పీఎల్ఐ పథకం కింద ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్లో అధిక ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టు చెప్పింది. బడ్జెట్లో పీఎల్ఐకి చేసిన కేటాయింపులు, వాస్తవ ఉపాధి కల్పన సామర్థ్యం మధ్య అంతరం ఉన్నట్టు పేర్కొంది. కార్మికుల నైపుణ్యం పెంపునకు వీలుగా ఉత్పాదకత, నాణ్యత గణనీయంగా పెంచాల్సి ఉంటుందని తెలిపింది. సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ విజ్ఞానం, ఐసీటీ నైపుణ్యాలను శిక్షణ కార్యక్రమాల్లో భాగం చేయాలని ఈ నివేదిక సూచించింది. శిక్షణ నాణ్యత పెంచడం, సంఘటిత రంగంలో కార్మికుల సంఖ్యను ఇతోధికం చేయడం ద్వారా అధిక ఉపాధి కల్పన లక్ష్యాలను సాధించొచ్చని
అభిప్రాయపడింది.