
భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.
ముకేశ్ అంబానీకి గుజరాత్లోని జామ్నగర్లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.
ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.
ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
మామిడి తోట పెట్టడానికి కారణం
1997లో గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.