అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, సెబీల తర్వాత తాజాగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా రంగంలోకి దిగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా పలు గ్రూప్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.
రూ.17,000 కోట్ల బ్యాంక్ రుణాలు దారి మళ్లించినట్లు అనిల్ అంబానీ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించడం, కంపెనీల చట్టం కింద తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ.. ఈ కేసును తీవ్రమైన మోసాలపై దర్యాప్తు చేసే ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేన్ ఆఫీస్ (SFIO)కు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు చేసి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో బాధ్యులను గుర్తించనుంది. దీని ఫలితంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.
అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, సెబీ విచారిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన దాదాపు రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 30 ఆస్తులు, అధార్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్ బీర్ హైటెక్ బిల్డ్, గమేసా ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, విహాన్ 43 రియల్టీ, కాంపియన్ ప్రాపర్టీస్ తో ముడిపడి ఉన్న ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు.


