కస్టమర్లకు దూరంగా బీమా కంపెనీలు | Insurance Companies Distant from Customers | Sakshi
Sakshi News home page

కస్టమర్లకు దూరంగా బీమా కంపెనీలు

May 31 2026 5:50 AM | Updated on May 31 2026 5:50 AM

Insurance Companies Distant from Customers

ప్రాక్సిస్‌ నివేదిక 

దేశీయంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్‌ సంస్థ ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయన్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. 

అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం వల్ల కస్టమర్లు కూడా వారికే ఎక్కువగా విశ్వసనీయంగా ఉంటున్నారని పేర్కొంది. ఫలితంగా కంపెనీలకి కస్టమర్లకు మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం లేదని రిపోర్టు తెలిపింది. సాధారణంగా బీమా కంపెనీలకు పాలసీల విక్రయాలపై నష్టాలే తప్ప లాభం ఉండటం లేదని వివరించింది. అండర్‌రైటింగ్‌ రూపంలో వచ్చే నిధుల కంటే షేర్‌ మార్కెట్లలోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా వచ్చే ఆదాయాలతోనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నట్లు ప్రాక్సిస్‌ తెలిపింది.

 దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే బీమా కంపెనీలు ఏజెంట్లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా కస్టమర్లకే పాలసీలను విక్రయించే పద్ధతిని పెంచుకోవాలని సూచించింది. కంపెనీల నుంచే నేరుగా పాలసీలను కొనే  కస్టమర్లకు తక్కువ ధరకు, సరళతరమైన పాలసీలను అందించాల్సి ఉంటుందని ప్రాక్సిస్‌ తెలిపింది. అలాగే క్లెయిమ్స్‌ను సత్వరం సెటిల్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొత్త నిబంధనలు, బీమా సుగమ్‌లాంటి ప్లాట్‌ఫామ్‌ల వల్ల కస్టమర్లతో నేరుగా కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయని తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement