
ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ‘గ్రాండ్ లార్సెనీ’ (పెద్ద మొత్తంలో దొంగతనం) అభియోగాలపై అమెరికా అధికారులు అరెస్టు చేశారు. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్లో రిమోట్గా పనిచేస్తున్న 39 ఏళ్ల మెహుల్ గోస్వామిపై మాల్టా పట్టణంలో రెండవ ఉద్యోగం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారుల నిధులలో 50,000 డాలర్లకు పైగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నాన్ బెయిలబుల్ క్లాస్ సి నేరానికి ఇతను 15 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడు.
మెహుల్ గోస్వామిపై అభియోగాలు ఇవే..
మెహుల్ గోస్వామి 2022 మార్చిలో మాల్టాలోని గ్లోబల్ ఫౌండ్రీస్ కోసం కాంట్రాక్టర్ గా రెండవ ఉద్యోగంలో పనిచేయడం ప్రారంభించాడు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం.. గోస్వామి న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సెమీకండక్టర్ సంస్థలో రెండో ఉద్యోగం చేశాడు.
"ప్రభుత్వ ఉద్యోగులకు సమగ్రతతో పని చేసే బాధ్యతను అప్పగించారు. కానీ గోస్వామి ఆ బాధ్యతను తీవ్రంగా ఉల్లంఘించారు" అని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ పేర్కొన్నారు.
"ప్రభుత్వం కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ రెండవ, పూర్తికాల ఉద్యోగం చేయడం పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో సహా ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే" అని లాంగ్ స్పష్టం చేశారు.
15 ఏళ్ల జైలు శిక్ష
సెకండ్ డిగ్రీ గ్రాండ్ లార్సెనీ ఆరోపణలపై గోస్వామికి దాదాపు పదేళ్ల జైలు శిక్ష పడుతోంది. న్యూయార్క్ రాష్ట్రంలో, ఈ రకమైన నేరానికి గరిష్ట జైలు శిక్ష 15 సంవత్సరాలు. మాల్టా టౌన్ కోర్టులో గోస్వామిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా సొంత పూచికత్తుపై విడుదల చేసి తదుపరి విచారణలు చేపట్టారు. న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం, ఈ అభియోగం 2020 జనవరి నాటికి బెయిల్కు అర్హత కలిగిన నేరం కాదు.
ఇదీ చదవండి: అమెజాన్లో 6 లక్షల ఉద్యోగాలు గాన్?