9 నెలల్లో రెండు దశాబ్దాల రికార్డ్‌

Indian Cos Garner 9. 7 Billion Dollers Via IPOs In Jan-Sep - Sakshi

72 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు

రూ. 72,500 కోట్ల సమీకరణ

జులై–సెపె్టంబర్‌లో మరింత స్పీడ్‌

ఐపీవో మార్కెట్‌పై ఈవై నివేదిక

న్యూఢిల్లీ: బుల్లిష్‌గా ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రతిబింబిస్తూ దేశీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఈ కేలండర్‌ ఏడాది(2021) తొలి 9 నెలల్లో 72 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా జనవరి– సెపె్టంబర్‌ మధ్య కాలంలో 970 కోట్ల డాలర్ల(రూ. 72,500 కోట్లు)ను సమీకరించాయి. వెరసి రెండు దశాబ్దాల తదుపరి అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ప్రోత్సాహకర పరిస్థితులు దోహదం చేసినట్లు కన్సలి్టంగ్‌ కంపెనీ ఈవై తాజాగా రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్‌ ట్రెండ్‌ మద్దతుతో దేశీయంగా క్యూ3(జులై–సెపె్టంబర్‌)లో లావాదేవీల సంఖ్య మరింత జోరందుకుంది. 72 ఐపీవోలలో డైవర్సిఫైడ్‌ ఇండ్రస్టియల్‌ ప్రొడక్టుల విభాగం నుంచి 15, కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ రిటైల్‌ విభాగం నుంచి 11 చొప్పున కంపెనీలు నిధులను సమీకరించాయి.

31 ఐపీవోలు
సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 31 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా 5 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకున్నాయి. వీటిలో డైవర్సిఫైడ్‌ ఇండ్రస్టియల్‌ ప్రొడక్టుల నుంచి 8 కంపెనీలు, టెక్నాలజీ విభాగం నుంచి 5 సంస్థలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ రంగాల నుంచి జొమాటో, నువోకో విస్టాస్‌ కార్ప్, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ భారీ ఇష్యూలను చేపట్టాయి. 2017 నాలుగో త్రైమాసికం తదుపరి దేశీ మార్కెట్లో ఈ క్యూ3 అత్యధిక లావాదేవీలకు నెలవైనట్లు ఈవై నిపుణులు ప్రశాంత్‌ సింఘాల్‌ తెలియజేశారు. కాగా.. ఇంతక్రితం 2018 తొలి 9 నెలల్లో ప్రైమరీ మార్కెట్‌ ద్వారా 130 కంపెనీలు నిధులను అందుకున్నాయి. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ4)లోనూ కొత్తతరం, టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ఐపీవోలకు రానున్నట్లు సింఘాల్‌ పేర్కొన్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సెక్స్‌ 60,000 పాయింట్ల మార్క్‌ను సైతం అధిగమించిన సంగతి తెలిసిందే.  

అంతర్జాతీయంగా
ప్రపంచవ్యాప్తంగా జులై–సెపె్టంబర్‌లో 2020 క్యూ3తో పోలిస్తే డీల్స్‌ 11 శాతం అధికమయ్యాయి. 2007లో నమోదైన గరిష్ట డీల్స్‌తో పోలిస్తే మరింత అధికంగా 18 శాతం పుంజుకున్నాయి. 2021 క్యూ3లో 547 ఐపీవోల ద్వారా కంపెనీలు 106.3 బిలియన్‌ డాలర్లు సమకూర్చుకున్నాయి. తొలి 9 నెలల్లో చూస్తే 1,635 కంపెనీలు 331 బిలియన్‌ డాలర్ల విలువైన పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది కంపెనీలలో 87 శాతం, పెట్టుబడుల సమీకరణలో 99 శాతం వృద్ధి. తొలి 9 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐపీవో సమీకరణ నిధుల్లో 3 శాతం(9.7 బిలియన్‌ డాలర్లు) వాటాను దేశ మార్కెట్‌ ఆక్రమించింది. ఐపీవోల సంఖ్యలో అయితే 4.4 శాతానికి చేరింది. ఇక గ్లోబల్‌ మార్కెట్లలోనూ 2020 పూర్తి ఏడాదితో పోలిస్తే క్యూ3లో డీల్స్‌తోపాటు, నిధుల సమీకరణ అత్యధికంగా నమోదుకావడం విశేషం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top