దేశ పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేసే ‘పారిశ్రామిక ఉత్పత్తి సూచీ’ (ఐఐపీ-ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) లెక్కింపు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా మరింత పారదర్శకంగా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా ఐఐపీ పరిధిని విస్తరిస్తోంది. ‘బేస్ ఇయర్ రివిజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ’ (టీఏసీ-ఐఐపీ) చేసిన ప్రతిపాదనల మేరకు సరికొత్త ఐఐపీ సిరీస్ను జూన్ 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.
ఈ కొత్త సిరీస్లో ఇప్పటివరకు ఉన్న బేస్ ఇయర్ 2011-12 స్థానంలో 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నూతన ఆధారిత సంవత్సరంగా (బేస్ ఇయర్) ఖరారు చేశారు. ఇటీవల మార్చిన దేశ జీడీపీ బేస్ ఇయర్ 2022-23, వినియోగదారుల ధరల సూచీ - సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ 2024ల తర్వాత వాస్తవిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా మారుస్తున్న మూడో కీలక ఆర్థిక సూచిక ఇదే కావడం గమనార్హం.
కొత్తగా చేరిన రంగాలు
గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకునేలా ఐఐపీ పరిధిని పెంచారు. అరుదైన ఖనిజాల విభాగంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగం కింద రేర్ ఎర్త్ మెటల్స్, మైనర్ మినరల్స్ను కొత్తగా ఈ సూచీలో చేర్చారు. అంతేకాకుండా, సాంప్రదాయ (నాన్ రెన్యువబుల్), పునరుత్పాదక (రెన్యువబుల్) ఇంధన వనరుల ద్వారా జరిగే విద్యుత్ ఉత్పాదనను ఇకపై విడివిడిగా చూపిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నల్లా కనెక్షన్ల సంఖ్య ఆధారంగా నీటి సరఫరా విభాగాన్ని అంచనా వేస్తారు. అమృత్ పథకం కింద ఉన్న 500 నగరాల్లోని డ్రైనేజీ కనెక్షన్ల ఆధారంగా మురుగునీటి నిర్వహణను, పట్టణాల్లో సేకరించి ప్రాసెస్ చేసిన వ్యర్థాల ఆధారంగా వేస్ట్ మేనేజ్మెంట్ రంగాన్ని ట్రాక్ చేస్తారు.
ఆరు విభాగాల వర్గీకరణ యథాతథం
బేస్ ఇయర్ మారినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల వర్గీకరణలను కమిటీ యథాతథంగా కొనసాగించింది. ఇందులో ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యంతర వస్తువులు, మౌలిక సదుపాయాలు-నిర్మాణ రంగ వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉన్నాయి.
జూన్ 1న తొలి నివేదిక
జూన్ 1న విడుదలయ్యే తొలి నివేదికలో ఏప్రిల్ 2023 నుంచి గణాంకాలను పొందుపరుస్తారు. ఇందులో ఏప్రిల్ 2026కి సంబంధించిన ముందస్తు అంచనాలు కూడా ఉంటాయి. ఆల్ ఇండియా జనరల్ ఇండెక్స్తో పాటు.. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాల వారీ సూచీలను కూడా ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ఈ నూతన సంస్కరణల ద్వారా దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన మరింత స్పష్టమైన, వాస్తవిక లెక్కలు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


