వైద్యరంగానికి ‘సహకారి’ కరవు | India Healthcare Crisis Why Allied Health Professionals Hold System Together | Sakshi
Sakshi News home page

వైద్యరంగానికి ‘సహకారి’ కరవు

Apr 4 2026 8:37 AM | Updated on Apr 4 2026 9:30 AM

India Healthcare Crisis Why Allied Health Professionals Hold System Together

పెరుగుతున్న ‘అలైడ్ హెల్త్‌కేర్’ నిపుణుల అవసరం

వైద్యం అంటే కేవలం డాక్టర్లు, మందులు మాత్రమే కాదు; తెర వెనుక ఉండి ప్రాణాలను కాపాడే ‘అలైడ్ హెల్త్‌కేర్’ నిపుణుల పాత్ర కీలకం. ఆధునిక వైద్య రంగంలో ఒక రోగికి వ్యాధి నిర్ధారణ జరగాలన్నా, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావాలన్నా లేదా డయాలసిస్ వంటి ప్రాణరక్షక ప్రక్రియలు కొనసాగాలన్నా డాక్టర్లతో పాటు సమానంగా శ్రమించే వారు ‘అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్’ (ఏహెచ్‌పీ). ల్యాబ్ టెక్నీషియన్లు, ఇమేజింగ్ స్పెషలిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది.. ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో పనిచేసే ఈ నిపుణులు ఆరోగ్య వ్యవస్థలో 60 శాతం మేర వాటాను కలిగి ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, వైద్యులు చికిత్సను నిర్ణయిస్తే.. అలైడ్ నిపుణులు ఆ చికిత్సను సహకారం అందిస్తారు.

భారీగా మానవ వనరుల కొరత

ప్రస్తుతం భారతదేశ ఆరోగ్య రంగం తీవ్రమైన నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. గణాంకాల ప్రకారం.. అవసరమైన నిపుణులు 1.09 కోట్లు. అందుబాటులో ఉన్నవారు 27.5 లక్షలు. లోటు 80 లక్షలకు పైగా. ఏటా సుమారు 10 లక్షల మంది అలైడ్ నిపుణుల అవసరం ఉండగా కేవలం 2 లక్షల మంది మాత్రమే విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. ఈ వ్యత్యాసం వల్ల రోగ నిర్ధారణలో జాప్యం, శస్త్రచికిత్సలు వాయిదాపడి అంతిమంగా రోగి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.

విద్య - ఉపాధి

అలైడ్ హెల్త్‌కేర్ కోర్సులు పూర్తి చేయడానికి విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడటంతోపాటు భారీగా ఆర్థిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అయితే, కెరీర్ ప్రారంభంలో లభించే వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. గ్రామీణ, మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఒక ప్రతిబంధకంగా మారుతోంది. తక్కువ శిక్షణతో ఎక్కువ ఆదాయం వచ్చే ఇతర రంగాల వైపు యువత మొగ్గు చూపడం వల్ల ఈ విభాగంలో నిపుణుల కొరత పెరుగుతోంది.

సంస్కరణల దిశగా అడుగులు

ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్‌సీఏహెచ్‌పీ) చట్టాన్ని’ తీసుకువచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించి రాబోయే ఐదేళ్లలో లక్ష మంది కొత్త నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాంపెటెన్సీ బేస్డ్ సిలబస్‌ను అమలు చేయనున్నారు.

అమలులో ఎదురవుతున్న సవాళ్లు

చట్టం తీసుకురావడం ఒక ఎత్తయితే దానిని ఆచరణలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం..

  • చట్టం అమలులోకి వచ్చే లోపు కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత అవసరం. పాత పద్ధతిలో చదివిన వారిని కూడా రిజిస్ట్రేషన్‌కు అనుమతించే విధానం కావాలి.

  • కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థల గుర్తింపు పొందే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలి. లేదంటే అడ్మిషన్లు ఆగిపోయి నిపుణుల కొరత మరింత తీవ్రమవుతుంది.

  • అవయవ మార్పిడి, అణు వైద్యం (న్యూక్లియర్‌ మెడిసిన్‌) వంటి స్పెషలైజ్డ్ విభాగాల్లో శిక్షణ కేవలం మెట్రో నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనే సాధ్యం. చిన్న పట్టణాల్లోని విద్యాసంస్థలకు స్టాండ్-అలోన్ ల్యాబ్‌లు, డయాలసిస్ సెంటర్లతో అనుసంధానం అయ్యే వెసులుబాటు కల్పించాలి.

  • అలైడ్ కోర్సులను బోధించడానికి డాక్టర్లను అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేసిన అలైడ్ నిపుణులు తక్కువగా ఉన్నందున ప్రారంభ దశలో నిబంధనల్లో కొంత సడలింపు అవసరం.

వికసిత్‌ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం అత్యాధునిక ఆసుపత్రులు ఉంటే సరిపోదు. వాటిని నడిపించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. రెగ్యులేటరీ వ్యవస్థ అనేది అడ్డంకిగా మారకుండా సామర్థ్యాన్ని పెంచే ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతమై ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందుతుంది.

ఇదీ చదవండి: ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement