2025–26లో 72 బిలియన్ డాలర్లు
విలువ పరంగా 24 శాతం అధికం
వెండి సైతం పెద్ద మొత్తంలోనే
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి.
బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది.
→ వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది.
→ బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది.
→ అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది.
→ స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.


