రిటైల్ ఇన్వెస్టర్లు ఓపిక పట్టాలి
సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక ఒడిదుడుకుల మధ్య భారత క్యాపిటల్ మార్కెట్లు బలంగా ఉన్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లు లోతుగా విస్తరిస్తున్నాయని, సూచీలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ మార్కెట్ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
స్వల్పకాలిక అలజడి.. దీర్ఘకాలిక లక్ష్యం
గత రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు పాండే కీలక సూచన చేశారు. ‘మార్కెట్ ఒడిదొడుకులు చూసి ఆందోళన చెందకుండా, భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండాలి. రిటైల్ పెట్టుబడిదారులు ఓపికగా ఉండటమే అత్యుత్తమ వ్యూహం. గతంలో కూడా ఇలాంటి అంతరాయాల తర్వాత మార్కెట్లు తిరిగి బలంగా కోలుకున్నాయి’ అని ఆయన గుర్తుచేశారు. గత 18 నెలలుగా బెంచ్ మార్క్ సూచీలు పరిమిత రాబడిని అందించడం వల్ల ఇన్వెస్టర్లలో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమేనని ఆయన విశ్లేషించారు.
ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ మన క్యాపిటల్ మార్కెట్లు కూడా పరిమాణం, సంక్లిష్టతలో అభివృద్ధి చెందుతున్నాయని పాండే హైలైట్ చేశారు. ‘సమర్థవంతమైన మార్కెట్లు కేవలం లాభాల కోసం మాత్రమే కాదు, అవి పారదర్శక ధరల ఆవిష్కరణకు, ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితులను గ్రహించడానికి సహాయపడతాయి. నమ్మకమే ఆర్థిక వ్యవస్థకు పునాది. అది లేకపోతే మూలధనం తగ్గిపోతుంది’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం


