ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసేటప్పుడు.. ఫ్యాకేజిలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇతర ప్రయోజనాలను అందివ్వడం సర్వసాధారణం. కానీ ఆఫ్రికాకు చెందిన ఒక కంపెనీ మాత్రం 'కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్' వెల్లడించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. వ్యాపారవేత్త అమన్ ధత్తర్వాల్తో, ప్రముఖ పాడ్కాస్టర్ కుశాల్ లోధా మాట్లాడుతూ.. ఒక ఆఫ్రికన్ కంపెనీ ప్లేస్మెంట్ల కోసం ఐఐఎంకు వచ్చి రూ.80 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ అందులో రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయించిందని వెల్లడించాడు. అంటే ఆ డబ్బు కిడ్నాపర్ల కోసం అన్నమాట.
"ఈ సీటీసీ వర్సెస్ చేతికి అందే జీతం అనేది ఒక రకమైన మోసం అని నాకు అనిపిస్తోంది" అని లోధా అన్నారు. "ఈ కంపెనీ ఐఐఎం కలకత్తాకు వచ్చి, సంవత్సరానికి రూ. 80 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది. పైగా ఇది ఆఫ్రికాకు చెందిన కంపెనీ. అక్కడ కిడ్నాప్లు చాలా సాధారణమని తెలుస్తోంది. కాబట్టి ఆ రూ. 80 లక్షల వార్షిక వేతనంలో, రూ. 40 లక్షలు జీతం కాగా.. మిగిలిన రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్. అంటే.. కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎప్పుడైనా కిడ్నాప్కు గురైతే.. రూ.40 లక్షలు కిడ్నాపర్లకు చెల్లించి విడిపించుకుంటుందన్న మాట. అయితే లోధా ఆ కంపెనీ పేరును వెల్లడించలేదు.
ఇదీ చదవండి: 'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?
ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒకవేళా కిడ్నాపర్లకు రూ.40 లక్షల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే?, ఆ తరువాత సంవత్సరం క్లెయిమ్ చేసుకోవాలా? అని కొందరు పేర్కొన్నారు. ఒకవేలా సన్నిహితులు కూడా ఆ డబ్బుకోసం ఉద్యోగిని కిడ్నాప్ చేయొచ్చు కదా అని ఇంకొందరు అన్నారు.


