
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 56వ సమావేశం ప్రారంభమైంది. జీఎస్టీ శ్లాబులో భారీ మార్పులు, సరళీకరణ చర్యలు, సంస్కరణలపై ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఏ వస్తువు చౌక అవుతుంది.. ఏది మరింత ప్రియం అవుంతుందన్నది ఈ రెండు రోజుల సమావేశంలో తేలుతుంది.
మధ్యతరగతి మేలు కోసం..
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, సుమారు 175 వస్తువులపై జీఎస్టీని కనీసం 10 శాతం తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే మరికొన్ని సవరణల కోసం సామాన్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతమున్న 5%, 12%, 18%, 28% నాలుగు శ్లాబుల నుంచి కేవలం రెండు శ్లాబులను మాత్రమే ప్రతిపాదించారు. నిత్యావసర వస్తువులకు 5 శాతం, అత్యవసరం కాని వస్తువులకు 18 శాతం. వీటితో పాటు పొగాకు వంటి హానికర వస్తువులు, రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై అదనంగా 40 శాతం శ్లాబ్ ను ప్రతిపాదించే అవకాశం ఉంది.
12 శాతం కేటగిరీలోని వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ వంటి 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి రానున్నాయి. వీటితో పాటు నెయ్యి, తాగునీరు (20 లీటర్లు), నామ్కీన్, కొన్ని బూట్లు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతం పన్ను శ్లాబుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఉపయోగించే పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులు, హెయిర్ పిన్స్ వంటి వస్తువులను కూడా 5 శాతం శ్లాబ్ పరిధిలోకి తీసుకురావచ్చు.
జీఎస్టీ తగ్గించే అవకాశం ఉన్న వస్తువుల జాబితా ఇలా..
వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు: టూత్స్ట్, షాంపూ, సబ్బు, టాల్కమ్ పౌడర్
పాల ఉత్పత్తులు: వెన్న, జున్ను, మజ్జిగ, పనీర్ మొదలైనవి.
రెడీ టు ఈట్ ఫుడ్స్: జామ్ లు, ఊరగాయలు, స్నాక్స్, చట్నీలు మొదలైనవి.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్: ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు.
ప్రైవేటు వాహనాలు: చిన్న కార్లు, హైబ్రిడ్ కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు.
చాలా వరకు ఆహార, వస్త్ర ఉత్పత్తులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. జీవిత, ఆరోగ్య బీమాపై సున్నా శాతం జీఎస్టీ ప్రతిపాదించారు. కొన్ని కేటగిరీలకు చెందిన టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని, వీటిపై ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 18 శాతం పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, ఇప్పుడు వాటిపై వేర్వేరు రేట్లను వర్తింపజేయవచ్చు. ఎంట్రీ లెవల్ కార్లపై 18 శాతం పన్ను వర్తిస్తుంది. ఎస్ యూవీలు, లగ్జరీ కార్లపై 40 శాతం పన్ను వర్తిస్తుంది.