క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై వేటు.. | Google Silent Layoffs Hit Cloud, Cybersecurity Teams Over AI Push | Sakshi
Sakshi News home page

క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై వేటు..

Jun 6 2026 8:36 AM | Updated on Jun 6 2026 8:53 AM

Google Silent Layoffs Hit Cloud, Cybersecurity Teams Over AI Push

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు తెరలేపింది. ఈసారి ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా నిశ్శబ్దంగా శ్రామిక శక్తిని కత్తిరిస్తూ వస్తోంది. కంపెనీకి అత్యంత కీలకమైన, లాభదాయకమైన గూగుల్ క్లౌడ్ విభాగంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకమైన సైబర్ సెక్యూరిటీ బృందాలపై కూడా ఈ కోతల ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. గత రెండు వారాలుగా ఈ లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి సాధారణ సంస్థాగత మార్పుల కంటే భిన్నంగా, వ్యూహాత్మక విభాగాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతుండటం టెక్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా పునర్నిర్మాణంలో గూగుల్ అత్యున్నత స్థాయి భద్రతా విభాగాలైన థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్, మాండియంట్ ఉద్యోగులు చిక్కుకోవడం గమనార్హం.

థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్

అంతర్జాతీయ సైబర్ నిఘా, వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతుతో జరిగే హ్యాకింగ్స్, ప్రధాన డిజిటల్ బెదిరింపులను ముందే గుర్తించి దర్యాప్తు చేసే ఉన్నత స్థాయి భద్రతా బృందం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలు ఈ బృందం ఇచ్చే నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ టీమ్‌లోని కొంతమంది సభ్యులకు గూగుల్ ఉద్వాసన పలికినట్లు సమాచారం. ప్రభావితమైన ఉద్యోగులు ఈ వివరాలను లింక్డ్‌ఇన్ ద్వారా పంచుకుంటున్నారు.

మాండియంట్

సైబర్ సెక్యూరిటీ రంగాన్ని బలోపేతం చేయడం కోసం 2022లో గూగుల్ దాదాపు 5.4 బిలియన్‌ డాలర్ల వ్యయంతో మాండియంట్ సంస్థను కొనుగోలు చేసింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్‌లో అత్యంత కీలకమైన ఈ విభాగంలోని సిబ్బందిని కూడా ప్రస్తుత లేఆఫ్స్ దెబ్బతీశాయి. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న సైబర్ సెక్యూరిటీ విభాగాలు సైతం ఈ అంతర్గత పునర్నిర్మాణం నుంచి తప్పించుకోలేకపోయాయనే వాస్తవాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

లేఆఫ్స్ వెనుక కారణం

తాజా ఉద్యోగాల తగ్గింపునకు సంబంధించి గూగుల్ అధికారికంగా సంఖ్యను వెల్లడించనప్పటికీ క్లౌడ్ విభాగంలోని అంతర్గత సమాచారం ప్రకారం ఉద్యోగులకు స్పష్టమైన కారణాన్ని వివరించినట్లు తెలుస్తోంది. ‘ప్రస్తుతం మార్కెట్ వేగంగా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందుకే కంపెనీ తన వనరులను, బడ్జెట్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కేటాయించాల్సి వస్తోంది’ అని కంపెనీ లేఆఫ్స్‌ బాధితులకు తెలిపినట్లు సమాచారం.

ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement