
రూ.38వేల కోట్లు
192 శాతం అధికం
2024–25లో మిశ్రమ ధోరణి
రూ.4.99 లక్షల కోట్ల దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మార్చిలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా 192 శాతం అధికంగా 4.47 బిలియన్ డాలర్ల (రూ.38వేల కోట్లు సుమారు) విలువైన పసిడి దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 మార్చి నెలలో దిగుమతులు 1.53 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే బంగారం దిగుమతుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది.
విలువ పరంగా వృద్ధి కనిపించగా, పరిమాణం పరంగా పసిడి దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులు 2023–24తో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 27 శాతం ఎగసి 58 బిలియన్ డాలర్లకు (రూ.4.99 లక్షల కోట్లు సుమారు) చేరాయి. 2023–24 సంవత్సరంలో పసిడి దిగుమతులు 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిమాణం పరంగా 757.15 టన్నుల బంగారం గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయింది.
2023–24లో ఇది 795.32 టన్నులుగా ఉండడం గమనించొచ్చు. దిగుమతి పరిమాణం తగ్గినప్పటికీ ధరల పెరుగుదలతో విలువ పరంగా వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 62 శాతం తగ్గగా (విలువ పరంగా), జనవరిలో 41 శాతం, 2024 డిసెంబర్లో 55 శాతం చొప్పున పెరిగాయి. సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తూ పెట్టుబడులు పెట్టే ధోరణి పెరగడం దిగుమతులకు మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు పెరిగిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
వాణిజ్య లోటుకు ఆజ్యం
బంగారం దిగుమతుల విలువ పెరగడం దేశ వాణిజ్య లోటు పెరిగేందుకు దారితీసింది. మార్చి నెలలో వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్ల లోటుతో ఆల్టైమ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం.