
కేవైసీ ప్రక్రియలను క్రమబద్ధీకరించండి
ఆర్థిక మంత్రి సీతారామన్ సూచన
ముంబై: క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, బీమా, పెన్షన్ నిధులను తిరిగి చెల్లించడాన్ని (రిఫండ్లు) వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థలు, శాఖలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, కేవైసీ ప్రక్రియల క్రమబధ్దికరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 29వ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
సామాన్య పౌరుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అర్హత కలిగిన వారికి రిఫండ్లను వేగంగా ప్రాసెస్ చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆర్బీఐ, సెబీ, ఎంసీఏ, పీఎఫ్ఆర్డీఏ, ఐఆర్డీఏఐ, బ్యాంక్లు, పెన్షన్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో దీన్ని చేపట్టాలని కోరారు. ఆర్థిక రంగం అంతటా సులభతర కేవైసీ విధానానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎస్డీసీకి సూచించారు. ఉమ్మడి కేవైసీ నిబంధనలతోపాటు సులభతర, డిజిటల్ కేవైసీ అవసరాన్ని ప్రస్తావించారు.