రాబోయే దశాబ్దం ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు అత్యంత సవాలుతో కూడుకున్నదని అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ముంబైలో జరిగిన టెక్స్ప్రోసిల్ ఎక్స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల కాలంలోనే అత్యంత అనిశ్చిత స్థితిని ఎదుర్కొంటోందని, పెరుగుతున్న రక్షణవాదం, సుంకం రహిత అడ్డంకులు, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఇలాంటి సంక్షోభ సమయాలు భారతదేశానికి కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, సుస్థిరత, క్రాఫ్ట్ ఆధారిత తయారీ వంటి పోకడలు భారత్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. గ్లోబల్ రిటైలర్లు తమ సోర్సింగ్ నిబంధనల్లో స్థిరత్వ ప్రమాణాలను తప్పనిసరి చేస్తున్నందున, ఎగుమతిదారులకు సుస్థిరత అనేది ఇకపై ఒక ఎంపిక కాదని, ఒక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి సాంకేతికత ప్రపంచ వస్త్ర పరిశ్రమను వేగంగా మారుస్తూ, కార్మిక ఖర్చులను తగ్గిస్తోందని మంత్రి గుర్తుచేశారు. ఈ మారుతున్న వాతావరణంలో భారతీయ వస్త్ర ఎగుమతిదారులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే... నైపుణ్యాల పెంపు, ఆవిష్కరణలు, డిజైన్ సామర్థ్యాలపై దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమలు ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సీతారామన్ నొక్కి చెప్పారు.


