వాహనాలకూ సైబర్‌ రిస్కులు | Cyber security risks to modern vehicles | Sakshi
Sakshi News home page

వాహనాలకూ సైబర్‌ రిస్కులు

Apr 22 2025 3:12 PM | Updated on Apr 22 2025 3:18 PM

Cyber security risks to modern vehicles

నివారణకు ఐడీపీఎస్, వీఎస్‌ఓసీలాంటి అధునాతన సాంకేతికతలు

ప్రామాణిక ఫీచరుగా మారనున్న సైబర్‌సెక్యూరిటీ

కార్లు, రవాణా వాహనాలు మరింత కనెక్టెడ్‌గా, సాఫ్ట్‌వేర్‌ ఆధారితమైనవిగా మారిపోతున్న నేపథ్యంలో ఎయిర్‌బ్యాగ్‌లలాగా ఆటోమోటివ్‌ సైబర్‌సెక్యూరిటీ కూడా ప్రామాణిక ఫీచరుగా మారనుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అంతర్గతంగా వాహన నెట్‌వర్క్‌ ట్యాంపరింగ్, జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్, స్టీరింగ్‌..బ్రేకింగ్‌ మొదలైన సిస్టమ్‌లను రిమోట్‌గా కంట్రోల్‌ చేయడం వంటి సైబర్‌సెక్యూరిటీపరమైన ముప్పులు కొత్త తరం వాహనాల్లో గణనీయంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇలాంటి రిస్కుల నుంచి వాహనాలను కాపాడేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు  కంపెనీలు చెబుతున్నాయి.

అంతర్జాతీయంగా పలు సంస్థలు వాహన రంగం కోసం సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్లుగా ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్ల తరహాలోనే డిజిటల్‌ భద్రత సాధనాలూ వాహనాల్లో తప్పనిసరి ఫీచర్లుగా మారొచ్చని సైబర్‌సెక్యూరిటీ సంస్థ హ్యాకర్స్‌ఎరా వ్యవస్థాపకుడు వికాస్‌ చౌదరి తెలిపారు.  ఐడీపీఎస్‌ (ఇన్‌ట్రూజన్‌ డిటెక్షన్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిస్టమ్స్‌), వీఎస్‌ఓసీ (వెహికల్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్స్‌) లాంటి సిస్టమ్‌లు ముప్పులను నివారించడానికే కాకుండా కొనుగోలు ప్రణాళికలనూ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.  

రియల్‌ టైమ్‌పర్యవేక్షణ..
పెద్ద ఎత్తున వాహనాలను నిర్వహించే ఫ్లీట్‌ ఆపరేటర్లు, కనెక్టెడ్‌ ప్రజా రవాణా వ్యవస్థలు మొదలైన వాటికి సంబంధించి ఏ ఒక్క వాహనంలోనైనా సెక్యూరిటీపరమైన సమస్యలు తలెత్తితే అవి మొత్తం నెట్‌వర్క్‌ అంతటికీ వ్యాపించే అవకాశం ఉంటుందని చౌదరి తెలిపారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు రూపొందించిన వీఎస్‌వోసీలు సాంప్రదాయ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్లలాగానే పని చేస్తాయి. కానీ ఇవి ప్రత్యేకంగా వాహనాల కోసం రూపొందించినవై ఉంటాయి. వాహనాల నుంచి వీటికి రియల్‌ టైమ్‌లో డేటా లభిస్తుంది. తద్వారా రిస్కులకు దారి తీసే ధోరణులను, ముప్పులను ఇవి పసిగట్టగలవు.

కొత్త తరం వాహనాలకు డిజిటల్‌ సేఫ్టీ ప్రోగ్రాంలను రూపొందించడం కోసం వాహనాల తయారీ సంస్థలు, సరఫరాదారులు, మొబిలిటీ స్టార్టప్‌లతో తాము కలిసి పని చేస్తున్నట్లు చౌదరి వివరించారు. ఎథర్‌నెట్, ఆర్‌ఎఫ్, బ్లూటూత్‌ మొదలైన వాటన్నింటికీ దేని రిస్కు దానికి ఉంటుందని, ఒక్కో దానికి ఒక్కో రకమైన రక్షణ అవసరమని పేర్కొన్నారు.  కనెక్టెడ్‌ వాహనాల్లో బలహీనతలను గుర్తించేందుకు, తగిన విధంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉంటుందని టాటా మోటార్స్‌ ప్రతినిధి తెలిపారు. ఐఎస్‌వో/ఎస్‌ఏఈ 21434లాంటి పరిశ్రమ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ద్వారా ఉత్తమ విధానాలను పాటించవచ్చని పేర్కొన్నారు.

కంపెనీలు ఎప్పటికప్పుడు వాహన సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్‌ సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేట్‌ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి ఏఐఎస్‌ 189 ప్రమాణాలు భారత్‌లో కూడా అమల్లోకి రానున్నట్లు చౌదరి చెప్పారు. ఇక యూఎన్‌ ఆర్‌155, ఐఎస్‌వో 21434లాంటి గ్లోబల్‌ ప్రమాణాలు కూడా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వాహనాల సైబర్‌సెక్యూరిటీ కేవలం ఉత్తమ విధానంగానే కాకుండా చట్టబద్ధంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు వాహనం  ‘ఎంత మైలేజీ’ ఇస్తుందనే మాట్లాడుకుంటూ ఉండగా.. ఇకపై ‘ఎంత సెక్యూర్‌గా ఉంటుంది’ అని మాట్లాడుకునే రోజులు వస్తాయని పేర్కొన్నారు.    
- సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement