కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా, పంపిణీ సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా నిబంధనలను సవరించింది.
పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కొత్త నిబంధనలతో గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజులలోపు తమ ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారితే.. మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ నిర్ణయం.. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు పొందేవారికి, వలస కుటుంబాలకు, అద్దె ఇళ్లలో నివసించే వారికి, విద్యార్థులు, తరచూ ప్రాంతాలు మారే కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
దేశంలో ఎల్పీజీ కొరత సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ వారం 68 శాతం భారత కుటుంబాలు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి. గత వారం ఇది 57 శాతంగా ఉండగా ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.
ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భారత్ తన అవసరాలకు పెద్దమొత్తంలో దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతోంది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. 20 శాతం మంది తమ అవసరాల కోసం బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ధరల కంటే రూ.300 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.


