కొత్త ఐటీ చట్టం రెడీ!  | CBDT is implementing a new Income Tax Act, 2025, effective April 1, 2026 | Sakshi
Sakshi News home page

కొత్త ఐటీ చట్టం రెడీ! 

Mar 21 2026 4:14 AM | Updated on Mar 21 2026 5:26 AM

CBDT is implementing a new Income Tax Act, 2025, effective April 1, 2026

సరళతర నిబంధనలను నోటిఫై చేసిన సీబీడీటీ 

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి.. 

పాన్‌ రూల్స్‌ విషయంలో భారీ ఊరట.. 

వేతనజీవులకు హెచ్‌ఆర్‌ఏ 

క్లెయిమ్‌లలో మరింత ప్రయోజనం 

కిరాయిదారు–యజమాని మధ్య సంబంధం చెప్పాల్సిందే

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ఇక కొత్త ఆదాయపన్ను (ఐటీ) చట్టం అమల్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం–2025 నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం నోటిఫై చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు–2026గా వ్యవహరించే ఈ కొత్త రూల్స్‌ 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాన్‌ విషయంలో భారీ ఊరటతో పాటు హెచ్‌ ఆర్‌ఏ క్లెయిమ్‌ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని మధ్య సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించడం వరకు అనేక మార్పులు కొత్త చట్టంలో చోటు చేసుకోనున్నాయి. 

అనవసర సెక్షన్లు తొలగింపు... 
పాత ఆదాయపన్ను చట్టం–1961 స్థానంలో తీసుకొస్తున్న కొత్త చట్టానికి 2025 ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను రేట్ల ప్రతిపాదనల వంటివేవీ ఇందులో లేనప్పటికీ ఆరు దశాబ్దాల నాటి సంక్లిష్టమైన పాత చట్టాన్ని మరింత సరళమైన, అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. 1961 నాటి ఐటీ చట్టంలో ఉన్న 819 సెక్షన్లను ఇప్పుడు 536కు కుదించడంతో పాటు చాప్టర్ల సంఖ్యను కూడా 47 నుంచి 23కు తగ్గించారు. అలాగే చట్టంలోని మొత్తం పదాలను 5.12 లక్షల నుంచి సగానికి అంటే 2.6 లక్షల పదాలకు తగ్గించడం గమనార్హం. అంతేకాకుండా మరింత మెరుగైన స్పష్టత కోసం 39 కొత్త టేబుల్స్, 40 కొత్త ఫార్ములాలను కూడా కొత్త చట్టంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

పాన్‌ వెసులుబాటు.. 
బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌/ఉపసంహరణ నుంచి కొత్త వాహనాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు, హోటల్‌ బిల్స్‌ చెల్లింపు దాకా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వెల్లడికి సంబంధించి లావాదేవీల పరిమితి భారీగా పెరుగుతుంది. బ్యాంకుల్లో ఇప్పుడు రూ.50,000కు మించి నగదు డిపాజిట్‌కు పాన్‌ కాపీ తప్పనిసరి నిబంధన ఉంది. కొత్త రూల్స్‌ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్‌ డిపాజిట్, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే (ఒకటి లేదా మరిన్ని ఖాతాలకు) పాన్‌ ఇస్తే సరిపోతుంది. ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, జాయింట్‌ డెవలప్‌మెంట్‌ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే (ప్రస్తుతం రూ.10 లక్షలు) పాన్‌ సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుంది. 

అలాగే, ఏ వాహన కొనుగోలుకైనా విలువ రూ.5 లక్షలకు మించితేనే పాన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్‌ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్‌ ఇవ్వాలన్న నిబంధన ఉంది. హోటల్‌/రెస్టారెంట్‌ బిల్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, బాంక్వెట్‌ హాల్స్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు రూ. లక్షకు మించితే ఇకపై పాన్‌ తప్పనిసరి. హోటల్‌/రెస్టారెంట్‌ బిల్లు రూ.50 వేలు మించితేనే ప్రస్తుతం పాన్‌ ఇవ్వాల్సి వస్తోంది. జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్‌ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.

ఇతర ముఖ్యాంశాలివీ..
→ ఇంటి అద్దెపై ఐటీ మినహాయింపును క్లెయిమ్‌ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని సంబంధాన్ని వెల్ల డించాల్సి ఉంటుంది. ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. 
→ ఇకపై ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు.. ఈ ఎనిమిది నగరాలు 50% హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితి జాబితాలోకి రానున్నాయి. మిగతా చోట్ల 40% పరిమితి కొనసాగుతుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలో వేతన జీవులకు మాత్రమే 50% నిబంధన వర్తిస్తోంది. 
→ షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్‌ సర్టిఫికెట్ల వంటి కన్వర్టెడ్‌ సెక్యూరిటీలకు సంబంధించి నిర్దిష్ట కేసుల్లో మూలధన లాభాలు స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది నిర్ణయించడానికి హోల్డింగ్‌ వ్యవధి లెక్కింపుపై మరింత స్పష్టత. మార్పిడికి ముందు అవి ఎంత కాలం పాటు ఉన్నాయనే దాన్ని కూడా హోల్డింగ్‌ పీరియడ్‌లో చేర్చుతారు. 
→ పన్ను రిటర్నుల దాఖలు మరింత సులభతరం కానుంది. సులభతర పత్రాలు, ఆదాయపన్ను శాఖ వద్దకు చేరిన సమాచారం ముందుగానే ఆయా పత్రాల్లో 
నింపి ఉంటుంది. 
→ యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే ప్రో త్సాహకాల విషయంలోనూ పన్ను మినహాయింపు పరిమితులు పెరగనున్నాయి.  
→ క్రిప్టో ఎక్సే్చంజీలు ఐటీ శాఖతో సమాచారం పంచుకోవడం ఇకపై తప్పనిసరి. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) సైతం ఆమోదనీయమైన ఎల్రక్టానిక్‌ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement