హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌.. ఇప్పుడు ఇక్కడే.. | Budvel The New Epicenter of Hyderabad Real Estate Boom | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌.. ఇప్పుడు ఇక్కడే..

Apr 18 2026 3:10 PM | Updated on Apr 18 2026 5:32 PM

Budvel The New Epicenter of Hyderabad Real Estate Boom

విల్లాలు, అపార్ట్‌మెంట్లతో శరవేగంగా అభివృద్ధి

ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశం

సామాన్యుల నుంచి ఎన్నారైల వరకూ అందరి దృష్టి బుద్వేల్‌ వైపే..

  • 15 కి.మీ. దూరంలో సెక్రటేరియట్, లక్డీకాపూల్‌ వంటి హాట్‌ స్పాట్స్‌..

  • 20 కి.మీ. దూరంలో ఐటీ హబ్, శంషాబాద్‌ విమానాశ్రయం..

  • చుట్టూ ఆర్మీ కాపలా.. హిమాయత్‌నగర్, గండిపేట జలాశయాలతో కళకళ..

  • కూతవేటు దూరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా, వైద్య, వినోద కేంద్రాలు.. 
    ..ఇలాంటి వసతులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశంలో ఉంటాయి. కానీ, అందుబాటు ధరల్లోనే సామాన్యుల సొంతింటి కలను నెరవేరుస్తోంది బుద్వేల్‌. రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట్, కిస్మత్‌పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. -సాక్షి, సిటీబ్యూరో

హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లీహిల్స్‌ నుంచి మాదాపూర్‌కు, అక్కడి నుంచి గచ్చిబౌలి, కొండాపూర్‌కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్‌ బుద్వేల్‌కు విస్తరించిందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణం సులువైంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లతో పాటు ఏరో స్పేస్‌ కంపెనీలకు సులువుగా చేరుకునే అవకాశం కలిగింది. అలాగే ఓఆర్‌ఆర్‌ మీదుగా 40 కి.మీ. దూరంలో షాద్‌నగర్, కొత్తూరులోని లాజిస్టిక్‌ పార్కులకూ చేరుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ధనవంతులు తమ మొదటి ఆస్తిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎంచుకుంటే.. రెండో ఆస్తిని రాజేంద్రనగర్‌లో ఎంచుకుంటున్నారు. ఇది చాలు రాజేంద్రనగర్‌ ఉన్నత శ్రేణి వర్గాలు ఉండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి..  

ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. 
రూ.35వేల నుంచి రూ.40 వేల మధ్య వేతనాలు ఉండే ప్రతి ఉద్యోకి ఇది అనుకూలమైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులందరికీ భారీ వేతనాలు ఉండవు. దీంతో గచి్చబౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఉండలేకపోతున్నారు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. రేతిబౌలి ఫ్లైఓవర్‌ మీదుగా రాయదుర్గం జంక్షన్‌ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు.

అందుకే గతంలో మాదిరిగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ జూబ్లీహిల్స్‌ మీదుగా సైబర్‌ టవర్స్‌కు వెళ్లే బదులు లంగర్‌హౌజ్‌ మీదుగా రాయదుర్గం జంక్షన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఐటీ హబ్‌కు కూతవేటు దూరమే. 20 నిమిషాల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులు ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు.

వంద ఫీట్ల రోడ్డు.. 
బుద్వేల్‌ నుంచి సన్‌సిటీ మీదుగా బండ్లగూడ జాగీర్‌ వరకూ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతం ఒక ప్రధాన వృద్ధి కారిడార్‌గా ఉండటంతో 3–4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని అంచనా. ఈ ప్రాంతం మధ్యస్థాయి, ఉన్నత స్థాయి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్‌ఐఆర్‌డీ, ఎన్‌జీరంగా వర్సిటీలతో పాటు అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. అప్పా జంక్షన్‌ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు.

రిజిస్ట్రేషన్లు రయ్‌.. రయ్‌.. 
గతేడాది రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 13,423 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,140 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాయి. రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. ప్రతి సంవత్సరం రిజి్రస్టేషన్లు 10–15 శాతం వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా బుద్వేల్, కిస్మత్‌పూర్, మంచిరేవుల, హైదర్షాకోట్‌ ప్రాంతాల్లో రిజి్రస్టేషన్లు జోరుగా సాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు విదేశీ సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాపర్టీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్‌ మెంట్లలో ధర చ.అ.కు రూ.10 వేల వరకు, విల్లాలు అయితే రూ.12 వేల వరకు చెబుతున్నారు.

బుద్వేల్‌ ఎకో ఫ్రెండ్లీ జోన్‌
బుద్వేల్‌ పర్యావరణ అనుకూల ప్రాంతం. జంట జలాశయాలు, గ్రీనరీ, ప్రతిపాదిత కొత్వాల్‌ ఎకో పార్క్‌లకు సమీపంలో ఉండటంతో ఎకో ఫ్రెండ్లీ జోన్‌ అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, వైద్యులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.
– బూరుగు రాంబాబు, డైరెక్టర్, ప్రణవ గ్రూప్‌

ఇది  చదివారా? రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్‌!  

Advertisement
 
Advertisement
Advertisement