ఐటీ సిటీలో రియల్ ఎస్టేట్ ఎటు పోతోంది? | Bengaluru Resident Calls 2BHK House Hunt In City A Nightmare | Sakshi
Sakshi News home page

కొందామంటే రూ.2 కోట్లు.. ఉందామంటే రూ.70 వేలు

Apr 4 2026 4:35 PM | Updated on Apr 5 2026 7:30 AM

Bengaluru Resident Calls 2BHK House Hunt In City A Nightmare

దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో నివసించే సగటు ఉద్యోగికి ఇప్పుడు 'సొంత ఇల్లు' అనేది ఒక తీరని కలగా మారుతోంది. నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి 'రెడ్డిట్' (Reddit) వేదికగా పంచుకున్న తన చేదు అనుభవాలు నగరంలోని భయానక రియల్ ఎస్టేట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

పీడకలగా మారిన ఇంటి వేట
బెంగళూరు నగరంలో ఒక రెండు పడక గదుల (2BHK) ఇంటి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఒక "పీడకల"గా మారిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎటు వెళ్తోంది?" అనే శీర్షికతో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

మూడేళ్ల క్రితం రూ. 1.4 కోట్లుగా ఉన్న ఒక ఫ్లాట్ ధర, ప్రస్తుతం ఏకంగా రూ. 2 కోట్లకు చేరింది. సదరు అపార్ట్‌మెంట్ ఒక పెద్ద మురికి కాలువ సమీపంలో ఉండటమే కాకుండా, అనేక లోపాలు, అసౌకర్యాలు ఉన్నాయి. అయినా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉందనే సాకుతో ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అద్దెలు కూడా భారమే..
కేవలం కొనుగోలు ధరలే కాకుండా, అద్దెలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. గతంలో తక్కువ ధరకే లభించిన ఫ్లాట్‌లకు ఇప్పుడు నెలకు రూ. 70,000 పైగా అద్దె చెల్లించాల్సి వస్తోందని, ఇది నమ్మశక్యంగా లేదని నివాసితులు వాపోతున్నారు. మూడు, నాలుగేళ్లలో డబ్బు ఆదా చేసి ఇల్లు కొందామనుకునే లోపే, ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.

పరిస్థితి తీవ్రత
కొన్ని ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్లు ఏకంగా రూ. 2.5 కోట్లకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత ధర పెట్టినా డిమాండ్ తగ్గకపోవడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలను గృహ కొనుగోలుకు దూరం చేస్తోంది. పెరుగుతున్న ధరలు, క్షేత్రస్థాయిలోని సమస్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement