
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌజ్లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్తో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది.
వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని చైనా దిగుమతులపై 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చైనాలో ఉత్పత్తి అవుతూ అమెరికాలోకి వస్తున్న యాపిల్ ఉత్పత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది కంపెనీ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సుంకాల నుంచి యాపిల్ ఉత్పత్తులను రక్షించడం తన ప్రాథమిక లక్ష్యంగా కుక్ భావించారు. దాంతో ట్రంప్ను ప్రత్యక్షంగా కలిసి టారిఫ్ మినహాయింపులు కోరినట్లు తెలిసింది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
గోప్యతా విధానాలపై చర్చ
వాణిజ్య సమస్యలతో పాటు యాపిల్ గోప్యతా విధానాలపై ట్రంప్, టిమ్కుక్ల మధ్య చర్చ జరిగింది. సమర్థంగా చట్టాలను అమలు చేసేందుకు న్యాయబద్ధమైన సంస్థల కోసం కొన్ని ఐఫోన్లను అన్లాక్ చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో కుక్ వినియోగదారుల గోప్యతకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారని సమాచారం.
ఇదీ చదవండి: బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధం
బలమైన సంబంధం
ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు కుక్ కృషి చేస్తున్నారు. యాపిల్ వ్యాపార కార్యకలాపాలపై, సుంకాల ప్రభావాన్ని తగ్గించే మార్గాలపై చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది.