
ముంబై: ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ 2025 ఆఖరు కల్లా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి వాటికి అధునాతన టెక్నాలజీ, భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల తెలిపారు.
ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. తొలి విడత 24 నెలల్లోగానే పూర్తి కాగలదని, దాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం (2025) ముగిసేలోగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని విజయానంద్ పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో గిగా ఫ్యాక్టరీకి కంపెనీ గతేడాది మేలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యాక్టరీలో లిథియం సెల్, బ్యాటరీ ప్యాక్లను తయారు చేయనుంది.