సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం.. ఎయిర్‌టెల్ కొత్త సర్వీస్! | Airtel Priority Postpaid Service Details | Sakshi
Sakshi News home page

సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం.. ఎయిర్‌టెల్ కొత్త సర్వీస్!

May 21 2026 8:48 PM | Updated on May 21 2026 8:48 PM

Airtel Priority Postpaid Service Details

భారతి ఎయిర్‌టెల్ కంపెనీ తమ వినియోగదారులకు మరింత మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ అనుభవాన్ని అందించేందుకు ''ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్'' అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. చాలామంది జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అంటే.. మార్కెట్లు, ట్రాఫిక్ జామ్‌లు లేదా పెద్ద ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో, వీడియో కాల్స్ నిలిచిపోవడం, ఫోటోలు అప్‌లోడ్ కావడంలో ఆలస్యం, లేదా ఈమెయిల్స్ డౌన్‌లోడ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎయిర్‌టెల్ ఈ కొత్త సేవను తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సర్వీస్ అనేది ప్రత్యేకంగా పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. దీనిద్వారా నెట్‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా వినియోగదారులకు స్థిరమైన.. వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం లభిస్తుంది. దీనికి కారణం ఎయిర్‌టెల్ తమ 5జీ నెట్‌వర్క్‌లో చేసిన లేటెస్ట్ టెక్నికల్ అప్‌గ్రేడ్. ఈ సాంకేతికతను స్లైసింగ్ అని పిలుస్తారు.

స్లైసింగ్ అనేది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉపయోగంలో ఉన్న నెట్‌వర్క్ టెక్నాలజీ. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఎయిర్‌టెల్ భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవను పొందడం చాలా సులభం. ఇప్పటికే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులైతే ఈ సదుపాయం ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ వాడుతున్న వారు ఎయిర్‌టెల్ యాప్ ద్వారా లేదా సమీప ఎయిర్‌టెల్ స్టోర్‌కి వెళ్లి తమ కనెక్షన్‌ను పోస్ట్‌పెయిడ్‌గా మార్చుకోవచ్చు.

అయితే.. ఈ సేవను పూర్తిగా ఉపయోగించాలంటే వినియోగదారుల వద్ద 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే ఫోన్‌లో తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉండటం అవసరం. ఫోన్‌లో అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే, సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదనంగా ఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా ఫోన్ ఈ సేవకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement