ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రకటించింది. అత్యాధునిక '5G స్లైసింగ్' (5G Slicing)సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశంలో ఈ తరహా 5G స్లైసింగ్ సేవలను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.
ఈ సరికొత్త సేవలు ఎయిర్టెల్లోని అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లపైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఈ ప్రయారిటీ ప్రయోజనాలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్లలోకి మారాలనుకుంటే ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్టెల్ స్టోర్ను సందర్శించి సులభంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు.
ధరల విషయానికి వస్తే.. సింగిల్ యూజర్ కోసం రూ.449 (ప్లస్ జీఎస్టీ) ప్లాన్ అందుబాటులో ఉండగా, ఫ్యామిలీ ప్లాన్లు రూ.699 నుంచి రూ.1749 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఫాస్ట్లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అంతేకాకుండా ప్లాన్లను బట్టి ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, యాపిల్ టీవీ+, నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి.
ఈ సేవలు 5G SA (Standalone) సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ పనిచేస్తాయి. వినియోగదారులు తమ ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ హై-స్పీడ్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ అర్హతను మొబైల్ సెట్టింగ్స్లో లేదా ఎయిర్టెల్ యాప్లోకి లాగిన్ అయి సులభంగా చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.


