కమోడిటీల ధరలు, కొత్త ప్రమాణాలే కారణం
బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ సూద్ వెల్లడి
కొత్త ఉత్పత్తుల శ్రేణి ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ వెల్లడించారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు. మంగళవారమిక్కడ కంపెనీ ఫ్లాగ్íÙప్ ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సేల్స్ 5% తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు సూద్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఏసీల మార్కెట్లో తమకు 14.2% మార్కెట్ వాటా ఉండగా దీన్ని 14.7 శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో 18.5%, ఆంధ్రప్రదేశ్లో 15.5% మార్కెట్ వాటా ఉందన్నారు. వివిధ ధరల శ్రేణిలో కొత్త ప్రమాణాలకు తగ్గట్లుగా 125 ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ హింగోరాని తెలిపారు. వీటిలో ఇన్వర్టర్, ఫిక్సిడ్, స్పీడ్, విండో ఏసీలతో పాటు ఐకానియా పేరిట ప్రీమియం మోడల్ కూడా ఉన్నట్లు ఆయన వివరించారు.


