భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో నిర్మించే జానకి సద నం సత్రంలో గది నిర్మాణానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. ఏపీలోని విజయవాడకు చెందిన నరసింహారావు రూ.12లక్షల చెక్కులను ఆది వారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాత కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.
వేధిస్తున్న వ్యక్తిపై కేసు
పాల్వంచ: మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై పాల్వంచ పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బస్టాండ్ సెంటర్లో బేకరి షాపు నడుపుకుంటున్న ఓ మహిళకు కొత్తగూడెంనకు చెందిన బొమ్మిడి రమాకాంత్తో పరిచయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరిలో సదరు మహిళకు తన స్నేహితుడు సాయి వద్ద నుంచి రూ.60 వేలు రమాకాంత్ ఇప్పించాడు. షూరిటీగా ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకుని తీసుకున్నాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మార్చి 2024లో రూ.8.50 లక్షలకు చెక్ బౌన్స్ కేసు పెట్టి లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాను తీసుకున్నది కేవలం రూ.60 వేలు మాత్రమేనని వేడుకుంది. ఇప్పుడు రూ.16 లక్షలు చెల్లించాలని బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా 2025 డిసెంబర్ నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్ చేయడం, అసభ్యకరమైన వీడియో కాల్స్, న్యూడ్ ఫోటోలు పంపిస్తున్నాడని, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


