టేకులపల్లి: మండలంలోని తడికలపూడి క్రాస్ వద్ద మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పశువుల అక్రమ రవాణా ఉదంతం వెలుగుచూసింది. సుజాతనగర్ మండలం ఉప్పరిగూడెంనకు చెందిన భూక్యా ఈర్య ఆళ్లపల్లి మండల సరిహద్దు గ్రామాల్లో తక్కువ ధరకు మూడు పెయ్యలు, మూడు గిత్తలను కొను గోలు చేసి కబేళాలకు తరలించే వారికి అమ్మాలనే భావనతో హాలియాతండాకు చెందిన కొర్ర రామా బొలెరోలో పండితాపురం తరలిస్తున్నాడు. ఈ క్రమాన పోలీసులు గుర్తించి ఆరు పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. అంతేకాక ఈర్యా, కొర్ర రామాపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి ఎస్ఐ ఎ.రాజేందర్ వెల్లడించారు. అక్రమంగా పశువుల తరలింపును అడ్డుకునేందుకు విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
దుమ్ముగూడెం: అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమో దు చేసినట్లు సీఐ వెంకటప్పయ్య తెలిపారు. మండలంలోని కాటాయి గూడెం శివారు తాలిపేరు కాల్వ వద్ద తనిఖీ చేస్తుండగా టాటా ఎస్ వాహనంలో ఐదు పశువులను తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించగా, అక్రమంగా రవాణా చేస్తున్న బూర్గంపాడు మండలానికి చెందిన ఎండీ ఫారుక్ ఖురేషి, ఎండీ ఫయాజ్, అశ్వాపురం మండలానికి చెందిన ఎండీ బాబుల్పై కేసు నమోదు చేశామని తెలిపారు.
స్టాక్ పాయింట్లలో డీఎం తనిఖీ
కారేపల్లి: రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను భద్రపరుస్తున్న స్టాక్ పాయింట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జె.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. కారేపల్లి మండలంలోని అప్పాయిగూడెం గోదాముతో పాటు జిన్నింగ్ మిల్ స్టాక్ పాయింట్లను ఆయన పరిశీలించారు. కారేపల్లిలో సోమవారం రాత్రి రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యాన వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొక్కజొన్నలను స్థానికంగానే దిగుమతి చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు. దీంతో డీఎం గోదాంలను పరిశీలించి నిల్వకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్యతో పాటు బొంతు రాంబాబు, బొల్లు హన్మంతరావు పాల్గొన్నారు.


