పాల్వంచరూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో బుధవారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63034 08458 నెంబర్ను సంప్రదించాలని ఈఓ వివరించారు.
ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సన్మానం
సూపర్బజార్(కొత్తగూడెం): పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఇద్దరు ఎస్ఐలు, ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ను మంగళవారం ఎస్పీ రోహిత్రాజ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన ఎస్ఐలు మీర్జా కమల్షా బేగ్, వంక రామరాఘవయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పరిశిక మల్లికార్జున్రావు సేవలు మరువలేనివని కొనియాడారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యానాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన అధికారులు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు మంగళవారం సందర్శించారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్నాయక్ క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు. పురావస్తు శాఖ ఏఈ శంకర్, నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రీన్వే ఎన్విరాన్మెంటల్ సొసైటీ అధ్యక్షుడు దుడ్డెల రవి తదితరులు పాల్గొన్నారు.
ఆర్గనైజింగ్
కార్యదర్శిగా జైపాల్
ఖమ్మంసహకారనగర్: టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకోగా ఉమ్మడి జిల్లా నుంచి జడ్ఎస్.జైపాల్కు స్థానం దక్కింది. ఆయన మంగళ వారం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీ కరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు జైపాల్ను టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఆ తర్వాత టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును జైపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
నాలుగు రాష్ట్రాలస్థాయి
కబడ్డీ పోటీలు ప్రారంభం
తల్లాడ: మండలంలోని కుర్నవల్లి గ్రామంలో నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వేంకటాచలపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తల్లాడ తహసీల్దార్ కరుణాకర్రెడ్డి, అంతర్జాతీయ చెస్ చాంపియన్ శీలం రఘురామిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


