భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో రెండురోజులుగా శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగగా.. మరోవైపు దుండగులు తమ చేతివాటం ప్రదర్శించారు. శుక్రవారం శ్రీరామనవమి రోజున సుమారు 50 సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. ముందురోజు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవంలో ఓ మహిళ మెడలో రూ. 2.50 లక్షల విలువైన బంగారుగొలుసు చోరీకి గురైంది. శనివారం మరో రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యా యి. ఈ రెండు రోజుల వేడుకల్లో గతంలో కంటే తక్కువ మంది భక్తులు వచ్చినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం పోలీసుల వైఫల్యమేనని ప్రజ లు ఆరోపిస్తున్నారు.
ట్రాఫిక్ నిలిపివేత..
శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పట్టాభిషేకం మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన సారపాక ఐటీసీ నుంచి భద్రాచలం వచ్చే సమయంలో ఐదు నిమిషాలు, మిథిలా స్టేడియం నుంచి భద్రగిరి మార్ట్ను ప్రారంభించేందుకు వెళ్లే సమయంలో మరో ఐదు నిమిషాలు, భద్రగిరి మార్ట్ నుంచి సారపాక ఐటీసీ గెస్ట్హౌస్కు వెళ్తున్న సమయంలో మరో ఐదు నిమిషాల వరకు ట్రాఫిక్ను పోలీసులు నిలిపివేశారు. కాగా, భద్రాచలంలో శుక్రవారం, శనివారం జరిగిన వేడుకల్లో బందోబస్తు నిర్వహించిన కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్వాహనాలను అనుమతించి, ప్రజలవాహనాలను అడ్డుకున్నారని, మీడియా ప్రతి నిధుల ద్విచక్రవాహనాలు సైతం ఆపి,వాగ్వాదానికి దిగారని విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో ఏ వేడుక జరిగినా ఇలాగే జరుగుతోందని, వచ్చే ఏడా ది అయినా ఈ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయా లని స్థానికులు కోరుతున్నారు.


