సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా ఈ వేడుకకు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారి వచ్చిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి గవర్నర్ స్వాగతం పలికారు.
భద్రగిరి మార్ట్ను ప్రారంభించిన గవర్నర్
గవర్నర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రాచలంలో భద్రగిరి మార్ట్ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. మార్ట్లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్లు గవర్నర్కు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి, పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు.


