భద్రాచలం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపడుతున్నట్లు రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. యాత్రను శుక్రవారం భద్రాచలంలో ప్రారంభించడంతో పాటు భక్తులతో కలిసి రైతుల మహాగర్జన పోస్టర్లు ఆవిష్కరించారు. రైతుల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయకపోగా, కౌలు రైతులకు న్యాయం జరగలేదని తెలిపారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లించలేదని, కార్పొరేషన్లు ప్రకటించినా పాలక మండళ్లు ఏర్పాటు చేయకపోగా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఓసీలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, నాయకులు సాంబశివరావు, అయిత నాగరాజు, రాజయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


