● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ● మణుగూరుకు చేరిన ‘సేవ్ సింగరేణి’ పోరుజాతా
మణుగూరు టౌన్/మణుగూరు రూరల్: ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.51 కోట్ల బకాయిలు విడుదల చేయడంతోపాటు మెడికల్ అన్ఫిట్ అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఏఐటీయూసీ ఆధ్వర్యాన సేవ్ సింగరేణి పేరిట చేపట్టిన పోరుజాతా(బస్సు యాత్ర) శుక్రవారం మణుగూరుకు చేరింది. యాత్ర మణుగూరు ఏరియాలోని గనులు, జీఎం కార్యాలయ ప్రాంతాల్లో కొనసాగింది. అనంతరం భారీ బైక్ ర్యాలీ నడుమ మణుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు చేరాక అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ర్యాలీగా పీవీ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయానికి చేరుకున్నారు. పలు చోట్ల జరిగిన సమావేశాల్లో సీతారామయ్య మాట్లాడుతూ యాజమాన్యం స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. మణుగూరు పీకేఓసీ డీప్ సైట్ బ్లాకుతో పాటు అన్ని బొగ్గు బావులను సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, వై.రాంగోపాల్, మేకల ఈశ్వర్రావు, ఎం.వీ.రాంనర్సయ్య, ఆవుల నాగరాజు, సురేందర్, శ్రీనివాసరావు, కుమారస్వామి, గంఽగాధర్రావు, రాజశేఖర్, సరెడ్డి పుల్లారెడ్డి, దుర్గ్యాల సుధాకర్, గడ్డం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.


