సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు భారీగా పోటెత్తగా.. వారి నుంచి వినతులు స్వీకరించాక ఆయన మాట్లాడారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సమర్థమైన పాలన అందించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంధ్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని ఇలా..
●అశ్వాపురం మండలం వేములూరు గ్రామానికి చెందిన కొమరం నాగమణి తనకు ఇంటి స్థలం ఉన్నా ఇల్లు లేదని, ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు ఇల్లు ఉన్నట్లు చూపించారని, తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందించగా హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు.
●ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సుశీల.. గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి లబ్ధి కలగలేదని ఫిర్యాదు చేయగా ఇల్లెందు ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు.
●బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఎం.రమణ.. 77 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని, జీవనోపాధి కోసం దివ్యాంగుల స్కూటీ మంజూరు చేయాలని కోరగా, దరఖాస్తును సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
నాణ్యమైన భోజనం అందించాలి
ములకలపల్లి: విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కేజీబీవీతో పాటు మూకమామిడిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను సోమవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల హాజరు, బోధన, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రత్యేక లక్ష్యాన్ని నిర్ధారించుకొని, సాధనకు కృషి చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్లో స్నాక్స్ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏలకవ్య మోడల్ స్కూల్లో పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మించాలని స్థానిక సర్పంచ్ కొర్సా ఆదిలక్ష్మి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ రామారావు, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీఓ సురేష్ బాబు, కేజీబీవీ ఎస్ఓ మహేశ్వరి, ఏకలవ్య ప్రిన్సి పాల్ అశోక్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్


