మత్స్యావతార రూపుడై..
భద్రగిరిలో ప్రారంభమైన
అధ్యయనోత్సవాలు
పెద్ద సంఖ్యలో తిలకించి పులకించిన భక్తులు
నేడు కూర్మావతారంలో
దర్శనమివ్వనున్న రామయ్య
భద్రాచలం : ‘మమ్మేలే రామయ్య.. మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు’ అంటూ భక్తులు స్వామివారిని తిలకించి పులకించిపోయారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గర్భగుడిలో మూలమూర్తుల వద్ద ఉత్సవాల నిర్వహణకు అనుజ్ఞ తీసుకున్న అర్చకులు, వేద పండితులు.. స్వామివారి ఉత్సవమూర్తులను, ఆళ్వార్లను మేళతాళాలతో బేడా మండపంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రబంధాలు, సేవాకాలాన్ని స్వామివారికి నివేదించారు. ప్రత్యేక ఆరాధన, విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించాక వైదిక పరిపాలనా సిబ్బందికి దీక్షా వస్త్రాలు అందజేశారు.
మత్స్యావతారుడైన రామయ్య..
వెకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీ సీతారామచంద్రస్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో ఉన్న స్వామివారిని ఆళ్వార్లతో కలిసి బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. కాగా, ఈ ఏడాది ప్రవేశపెట్టిన విధానంలో తొలిరోజు ఉత్సవ ఖర్చుతో పాటు పట్టు వస్త్రాలను భద్రాచలానికి చెందిన హోల్సేల్, రిటైల్ వర్తక అసోసియేషన్ వారు అందజేసి ఉత్సవానికి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వామివారి పల్లకీ మోసి, పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు కూర్మావతారం..
అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆదివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వన్నునారు. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మంధర పర్వతాన్ని తన వీపున నిలిపి పైకెత్తాడు. ఈ అవతారాన్ని దర్శిస్తే శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
మత్స్యావతార రూపుడై..


