కపాస్ కష్టాలు
ఇబ్బందులు పట్టించుకోరా?
తేమ శాతం పేరుతో కొనుగోలుకు ససేమిరా
దళారులకే అమ్ముకుంటున్న పత్తి రైతులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాగు సమయంలో వర్షాలు ఇబ్బంది పెడితే, కొనుగోల దశలో ప్రభుత్వ విధానాలు, సీసీఐ సిబ్బంది నిర్వాకంతో పత్తి రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
యాప్లో వివరాల నమోదుతో..
గతంలో జిన్నింగ్ మిల్లుల దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాలు ఉండేవి. తమ సమీపంలో ఉన్న మిల్లులోనే కాకుండా రాష్ట్రంలో ఏ మిల్లు దగ్గర గల కొనుగోలు కేంద్రంలోనైనా అనుకూల సమయంలో వెళ్లి రైతులు పత్తిని అమ్ముకునేవారు. కానీ, ఈసారి కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సీసీఐ చేపట్టింది. పత్తి అమ్మే రైతులు ఈ యాప్లో వివరాలు నమోదు చేస్తే.. ఏ రోజు, ఏ మిల్లు వద్ద పత్తి అమ్మాలనేది యాపే సూచిస్తుంది. ఉదాహరణకు ఇల్లెందు ప్రాంతానికి చెందిన రైతులు గతంలో సమీపంలోని కారేపల్లి జిన్నింగ్ మిల్లు లేదంటే వరంగల్ ఏనుమాముల మార్కెట్కు వెళ్లి విక్రయించేవారు. ఈసారి ఇల్లెందుకు చెందిన చాలా మంది రైతులకు సుజాతనగర్ సెంటర్ను కేటాయించారు. దీంతో ఇల్లెందు నుంచి కొత్తగూడెం మీదుగా సుజాతనగర్ వరకు పత్తిని తీసుకునిరావాల్సి వస్తోంది.
తేమ చిక్కులు..
అమ్మకానికి తెచ్చిన పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే సీసీఐ సిబ్బంది కొనుగోలు చేస్తారు. 8 శాతం తేమ ఉంటే క్వింటా పత్తికి గరిష్టంగా రూ.8,100 చెల్లిస్తుండగా 12 శాతం తేమ ఉన్న పత్తికి కనిష్టంగా రూ.7,689 మద్దతు ధరగా నిర్ణయించారు. కపాస్ యాప్లో సూచించిన రోజున రైతులు పత్తిని విక్రయానికి తీసుకొస్తున్నారు. అక్కడి సీసీఐ సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలతో తేమ శాతాన్ని తనిఖీ చేస్తుండగా 12 శాతం కంటే ఎక్కువ ఉంటే తిరస్కరిస్తూ మరో రోజు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చేను నుంచి కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చేందుకు సగటున రూ.5000 పైగా ఖర్చవుతోంది. తేమ పేరుతో మరోసారి రావాలనే సీసీఐ సిబ్బంది సూచనలు రైతుల పాలిట గుదిబండగా మారుతున్నాయి.
మాది ఇల్లెందు మండలం. కపాస్ యాప్లో సుజాతనగర్ కొనుగోలు కేంద్రం పేరు వచ్చింది. 30 క్వింటాళ్ల పత్తిని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేందుకు కూలీలు, ట్రాలీ ఖర్చులు రూ.7500 అయ్యాయి. 9 శాతం తేమ ఉండటంతో ఆ మేరకు మద్దతు ధర లభించింది. కానీ నాతో పాటు వచ్చిన కొందరిని తేమ పేరుతో నిరాకరించగా వారు ఇబ్బంది పడ్డారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ మేరకు ధర నిర్ణయించి కొనుగోలు చేసే విషయాన్ని సీసీఐ పరిశీలించాలి.
– వెంకటేశ్వర్లు, ఇల్లెందు
చెట్టు నుంచి పత్తి తీసినప్పుడు 20 శాతానికి పైగా తేమ ఉంటుంది. దాన్ని ఆరబెట్టడం ద్వారా తేమ తగ్గుతుంది. ప్రస్తుతం 12 నుంచి 8 శాతం వరకు తేమ ఉన్న పత్తికి గరిష్ట మద్దతు ధర ఇస్తున్నట్టుగా 12 నుంచి 20 శాతం వరకు తేమ ఉన్న పత్తికి మరో రేటు నిర్ణయిస్తే రైతుల ఇబ్బందులు తొలగుతాయి. కానీ అలాంటి ఏర్పాట్లేవీ కొనుగోలు కేంద్రాల్లో లేవు. దూరాభారాలకు ఓర్చి, రవాణా ఖర్చులు భరించి గంటల తరబడి నిరీక్షించిన రైతులు, చివరకు తేమ శాతంతో ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నారు. మరి కొన్ని సమయాల్లో మిల్లు వర్గాలే తేమ పేరుతో భారీగా కోత పెడుతూ పత్తిని కొంటున్నారు. ఈ రెండూ కాదంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో సగం మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి మద్దతు ధర పొందలేకపోతున్నారు.
యాప్ విధానంతో పెరిగిన రవాణా భారం
కపాస్ కష్టాలు


