
22 నుంచి కార్తీక మాసోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలోగల శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామి వారికి నెలరోజుల పాటు తులసీ ఆరాధన, వేకువజామున దీపారాధనలు, రుద్రాభిషేకం, కార్తీక మాస నిత్యాభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే సోమవారాలు, ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు, మాస శివరాత్రి రోజున స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటాయని పేర్కొన్నారు.
ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపేలా ఇటీవల తీసిన మూడు ఫొటోలే కాక మూడు నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 25 తేదీలోగా షార్ట్ ఫిల్మ్ పెన్డ్రైవ్, గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు తీసిన ఫొటోలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అలాగే, డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలనే అంశాలపై విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాసిన వ్యాసాలను ఈనెల 28వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ముగ్గురికి బహుమతులు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాలకు 87126 82121 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
నేడు జాబ్ మేళా
మణుగూరు రూరల్ : మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీ పరిధిలో గల మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ గిరిజన యువతకు మెదక్ ఐటీసీ, ఇంటిగ్రేటెడ్ కన్జ్యూమర్ గూడ్స్ తయారీ, లాజిస్టిక్ (ఐసీఎంఎల్) గండుపల్లి మెదక్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ ఒకేషనల్తో పాటు ఐటీఐ చేసి, 18 నుంచి 29 సంవత్సరాలు ఉన్న వారు మిషన్ ఆపరేటర్ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. మొత్తం 40 సీట్లలో గిరిజన మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి గల గిరిజన యువత ఈనెల 15న జాబ్మేళాకు హాజరు కావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు (ఐసీఎంఎల్) ఐటీసీ మెదక్ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
16న కొత్తగూడెంలో..
సింగరేణి(కొత్తగూడెం): మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ పరిధిలో ఖాళీగా ఉన్న 2,190 పోస్టుల భర్తీకి ఈనెల 16న కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 24 – 43 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగులు, డీగ్రీ, ఐటీఐ, బీటెక్, ఎంటెక్, ఏఎన్ఎం, జీఎన్ఎం కోర్సులు చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డీర్ పార్క్కు పోలీస్ రక్ష
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని డీర్పార్కు వద్ద రక్షణ కోసం ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించారు. సెలవురోజుల్లో సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుందని, వైల్డ్లైఫ్ సిబ్బందికి దుప్పుల ఆలనా పాలనతోనే సరిపోతుందని, పర్యాటకుల భద్రత కోసం పోలీసులను ఏర్పాటు చేశామని ఎఫ్డీఓ బి.బాబు తెలిపారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుష కానిస్టేబుళ్లు ఉండగా వైల్డ్లైఫ్ చెక్పోస్టు వద్ద ఒకరు, డీర్పార్కు వద్ద ఒకరు, బోటింగ్ పాయింట్ వద్ద మరొకరు విధులు నిర్వహిస్తారని వివరించారు.

22 నుంచి కార్తీక మాసోత్సవాలు