
మరో ముందడుగు
రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న సీతమ్మ సాగర్ బరాజ్, కరకట్టల నిర్మాణం విషయంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్కు కీలకమైన టెక్నికల్ కమిటీ అనుమతులు గత ఏప్రిల్లో జారీ కాగా, ఇప్పుడు భూ నిర్వాసితులకు పరిహారం విషయంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చింది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
సీతమ్మసాగర్ కరకట్ట నిర్వాసితులకు పరిహారంలో కదలిక
● ఈ ప్రాజెక్టుతో ఎగువ ప్రాంతాల్లో ముంపు సమస్య
● వరద నివారణకు ఎత్తుగా కరకట్టల నిర్మాణం
● పరిహారం ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆందోళనలు
100 అడుగుల ఎత్తుతో..
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై సీతమ్మసాగర్ పేరుతో బరాజ్ నిర్మాణ పనులు 2022 చివరలో ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ప్లాన్లో బరాజ్కు ఇరువైపులా కొద్ది దూరం మేరకే రివిట్మెంట్ నిర్మాణాలు ఉన్నాయి. అయితే అదే ఏడాది జూలైలో 29 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద గోదావరికి రావడంతో నదీ తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతేకాదు.. నదిలో కలిసే వాగుల్లోకి సైతం గోదావరి వరద ఎగపోటు వేసింది. ఈ భారీ వరద ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సీతమ్మ సాగర్ బరాజ్కు ఎగువన ఇరువైపులా, నదిలో కలిసే వాగులకు సైతం కరకట్టలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద కరకట్ట ఎత్తు 80 అడుగులుగా ఉంటే బరాజ్కి ఎగువన వంద అడుగుల ఎత్తుతో నిర్మించేలా డిజైన్ చేశారు.
భూసేకరణ సమస్య..
సీతమ్మ సాగర్కు ఎగువన ఒక వైపు అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలు, మరోవైపు దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఉన్నాయి. అశ్వాపురం వైపు 40 కి.మీ., దుమ్ముగూడెం వైపు 55 కి.మీ. కరకట్టల పనులు వెంటనే ప్రారంభించారు. ఈ కొత్త నిర్మాణాల కోసం స్థానిక రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చింది. ఇందులో కొన్ని పట్టా భూములు ఉండగా మరికొన్ని పట్టా లేనివి ఉన్నాయి. అయితే కరకట్ట పనులు చేపట్టడానికి ముందే తమకు పరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈ తరహా ఆందోళనలు ఎక్కువగా జరిగాయి. ఓ వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు నిర్మాణ పనులు మొదలయ్యాయి.
కోర్టు ఆదేశాలతో..
సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైన సీతమ్మ సాగర్ బరాజ్, కరకట్ట నిర్మాణ పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, తమకు సరైన పరిహారం అందించలేదని కొందరు న్యాయస్థానం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో 2023 మే చివరి వారంలో సీతమ్మ సాగర్ బరాజ్ పనులు ఎక్కడివక్కడే ఆపేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బరాజ్తో పాటు కరకట్ట పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో రెండేళ్లుగా కరకట్ట పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థల వారు కొందరు యంత్రాలతో పాటు కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని సంస్థలు భారీ యంత్రాలను నదీ తీరంలోనే నిలిపి ఉంచగా.. అవి తుప్పు పట్టే దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సీతమ్మసాగర్ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడింది.
దశలవారీగా పరిహారం..
కరకట్టల నిర్మాణం కారణంగా నష్టపోయే రైతులను ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుర్తించింది. అయితే వారికి పరిహారం మాత్రం అందలేదు. తాజాగా చర్ల మండలం దేవరపల్లి(జెడ్) గ్రామంలో 13.26 ఎకరాల స్థలానికి సంబంధించి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దశల వారీగా పరిహారం చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అంతకుముందే సీతమ్మ సాగర్ బరాజ్, సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చే విషయంలోనూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత ఏప్రిల్లో టెక్నికల్ కమిటీ నుంచి అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు రావడం ఇక లాంఛనమే అనే తరుణంలో భూ నిర్వాసితుల పరిహారం విషయంలోనూ కదలిక వచ్చింది.

మరో ముందడుగు