
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
సుజాతనగర్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, వాటితో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ బి.రోహిత్రాజు అన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ధన్వంతరీ ఫార్మసీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యంగా తమ శాఖ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా నిరంతరం విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు ప్రతాప్, రాయల వెంకటేశ్వర్లు, కరుణాకర్, శివప్రసాద్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము, కళాశాల చైర్మన్ అరికెల భాస్కర్, ప్రిన్సిపాళ్లు నాగరాజు, రామకోటేశ్వరరావు, ఎస్సై ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్రాజు సూచన