
పాఠశాలకు ప్రాణం పోశారు..
టేకులపల్లి : టేకులపల్లి మండలం దాసుతండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక మూసివేస్తారనే ప్రచారం సాగగా.. ఇద్దరు విద్యార్థినులు చేరి బడికి ప్రాణం పోశారు. ఇక్కడ గతేడాది మూడో తరగతిలో ముగ్గురు, నాలుగో తరగతిలో ముగ్గురు విద్యార్థులు చదువుకున్నారు. ఈ సంవత్సరం అందులో నలుగురు టీసీ తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. నాలుగో తరగతిలో అనన్య, ఐదో తరగతిలో ఝాన్సీ మాత్రమే మిగిలారు. వారు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తామంటూ ఇంతకాలం బడికి రాలేదు. దీంతో విద్యార్థులు లేక పాఠశాల మూతపడుతుందనే ప్రచారం సాగింది. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాఠశాల పేరుతో ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించిన ప్రధానోపాధ్యాయురాలు(సింగిల్ టీచర్) విజయనిర్మల.. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, మెరుగైన బోధనపై గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో 20 మంది బడీడు పిల్లలు ఉండగా అంతా ప్రైవేట్ స్కూళ్లపై మోజుతో అటే పంపించారు. దీంతో హెచ్ఎం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పడంతో నాలుగో తరగతి చదివే గుగులోత్ అనన్య అనే విద్యార్థిని బుధవారం పాఠశాలలో చేరింది. ఐదో తరగతికి చెందిన ఝాన్సీని కూడా గురువారం చేర్పిస్తామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మూసివేస్తారనే ప్రచారం జరిగిన పాఠశాలకు ప్రాణం పోసినట్టయింది.