
సీఐ మెడకు.. ఎన్ఆర్ఐ కేసు
● ఇల్లెందు సీఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు ● ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ
ఇల్లెందు: ఓ ఎన్ఆర్ఐ దంపతుల మధ్య ఏర్పడిన వివాదం.. చివరకు ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ మెడకు చుట్టుకుంది. పోలీస్స్టేషన్కు వచ్చిన తమ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి తల్లిదండ్రులు మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్రెడ్డికి ఫిర్యాదు చేయగా.. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా.. ఇల్లెందు కరెంటాఫీస్ ఏరియాకు చెందిన పి.నవీన్రెడ్డికి హైదరాబాద్లోని శంగిచెర్లకు చెందిన శ్రావ్యతో 2023 జూన్లో వివాహం జరిగింది. కొంతకాలం పాటు అమెరికాలోని డల్లాస్లో కాపురం సాగించాక హోం సిక్ పేరుతో ఇంటికి వచ్చిన శ్రావ్య తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సుమారు ఏడాది గడిచినా నవీన్రెడ్డి శ్రావ్యను తీసుకెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఈనెల 19న ఇల్లెందు పోలీసులను ఆశ్రయించగా సీఐ సత్యనారాయణ, షీం టీం సభ్యులు ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమను స్టేషన్కు పిలిచి శ్రావ్య కుటుంబసభ్యుల సమక్షంలో సీఐ బెదిరించారని నవీన్రెడ్డి తల్లిదండ్రులు ఉప్పల్రెడ్డి, పద్మజ ఐజీకి ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది.
ఖమ్మం అదనపు డీసీపీ విచారణ..
సీఐ సత్యనారాయణపై ఫిర్యాదు అందగా ఐజీ ఆదేశాల మేరకు ఖమ్మం అదనపు డీసీపీ ప్రసాదరావు బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహించారు. నవీన్ రెడ్డి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిచిన సమయంలో సీసీ పుటేజీలను పరిశీలించడంతో పాటు ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు.
పోస్టింగ్ కోసం అంతర్గత పోరు..
ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ మార్పు జరుగుతుందని కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. దీంతో పాటు ఈ సబ్ డివిజన్కు చెందిన ఓ అధికారి ఇల్లెందు సీఐ పీఠంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సత్యనారాయణను తప్పించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్ఆర్ఐ కేసు ముందుకు రావడంతో అతడి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశాడంటూ ఐజీకి ఫిర్యాదు చేయడం, సీఐపై సస్పెన్షన్ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది.
నా భర్త నుంచి న్యాయం చేయండి
పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఏడాదికే తిరిగి ఇంటికి పంపించి తన జీవితంతో ఆడుకుంటున్న ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి నుంచి న్యాయం చేయాలంటూ శ్రావ్య పోలీసులను కోరారు. తన తల్లిదండ్రులు దుబ్బాక వేణుగోపాల్రెడ్డి, శ్రీలతతో కలిసి బుధవారం ఆమె ఇల్లెందు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ వివాదంపై మాట్లాడేందుకు తమను సీఐ రమ్మని చెప్పడంతోనే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. అమెరికాలో ఉన్న రోజుల్లో తనకు సమాచారం ఇవ్వకుండానే పలువురు డాక్టర్లతో కొన్ని పరీక్షలు చేయించాడని, ఆ తర్వాత వీసా గడువు ముగిసిందంటూ ఇంటికి పంపించాడని తెలిపారు. 2025లో మళ్లీ వీసా వచ్చినా రద్దు చేయించాడని, ఈ విషయం అడిగితే దురుసుగా సమాధానం ఇస్తున్నాడని, దీంతో తాను పోలీసులను సంప్రదించానని వివరించారు.

సీఐ మెడకు.. ఎన్ఆర్ఐ కేసు