
పరిశ్రమలతోనే ఆర్థిక ప్రగతి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్బజార్(కొత్తగూడెం): పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మతో కలిసి నిర్వహించిన టీజీ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అననుకూలమని, దీంతో పరిశ్రమల స్థాపనకు పలువురు ముందుకొస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ , మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు అవసరమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోచార్, ఏబీసీడీ డ్రైవ్లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, నవభారత్ లిమిటెడ్ వారు సమన్వయంతో ఉపాధిహామీ పథకం ద్వారా ఇటుకలతో వర్క్షెడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఐటీఐ విద్యార్థులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తిరుపతయ్య, ఎల్బీఎం రాంరెడ్డి, గిరిజన సంక్షేమాధికారి అనసూయ, ఉపాధి కల్పన శాఖాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖ ఏడీ రమేష్, మైనింగ్ ఏడీ దినేష్ పాల్గొన్నారు.
మునగపై పర్యవేక్షణ ఉండాలి
నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటిన మునగ తోటలు ప్రస్తుతం పూత, కాత దశలో ఉంటాయని, సరైన పర్యవేక్షణ లేకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని కలెక్టర్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలని, ఉపాధి హామీ పథకం ద్వారా నీటి గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. పుష్పో త్పత్తి, కాత దశలో పశువుల ఎరువు (5–10 కేజీలు), యూరియా (100 గ్రా), పొటాష్ (50గ్రా) మొక్కలకు వేయాలని, ప్రతీ వారం కలుపు తొలగించాలని సూచించారు. రైతులు ఈ సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించొచ్చని పేర్కొన్నారు.
ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి..
పాల్వంచరూరల్ : అవసరాలకు వినియోగించే నీరు బయటకు రాకుండా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీరు కళాశాలలోకి వస్తోందని ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలెక్టర్ దృష్టికి తేగా.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలతో పాటు యూకలిఫ్టస్, వెదురు మొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఏపీఓ పొరండ్ల రంగా, ఏఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పరిశుభ్రతే ప్రధానం..
కొత్తగూడెంఅర్బన్: అంటువ్యాధుల నివారణలో చేతుల పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉపాధ్యాయులకు సూచించారు. డయేరియా నివారణపై బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, సురక్షిత తాగునీటిని అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, డీఎంహెచ్ఓ భాస్కర్, డీసీహెచ్ఎస్ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తేజశ్రీ, కోరా శ్రీ యాదవ్, సీహెచ్ఓ నాగభూషణం పాల్గొన్నారు.