
ఆగని అరెస్టులు
సింగరేణి మెడికల్ బోర్డులో బదిలీలు, డిప్యుటేషన్లను ఆధారంగా చేసుకుని ఇంత కాలం దందాకు పాల్పడిన వ్యక్తులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ అంశంపై ఏసీబీ సీరియస్గా దృష్టి పెట్టడంతో ఆరు నెలల్లో ముగ్గురు అరెస్టయ్యారు. రాబోయే రోజుల్లో మరికొందరిని సైతం అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని సమాచారం.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
సింగరేణిలో అవినీతి దందాపై ఏసీబీ నజర్
● కార్పొరేట్ కార్యాలయానికీ అంటుతున్న మరకలు
● 40 రోజుల్లో మూడు చోట్ల దాడులు
● ఏసీబీ చేతికి కీలక సమాచారం, మరిన్ని దాడులకు అవకాశం !
కార్పొరేట్ ఆఫీస్ అడ్డాగా..
తెలంగాణలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. బొగ్గు వెలికితీతలో సంస్థకు వందేళ్ల చరిత్ర ఉండగా ఇటీవల థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం, నియామకాలు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ అంతా కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆఫీస్ వేదికగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ గతంలో పని చేసిన ఓ వ్యక్తి తనకు ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉందంటూ కార్మికులను నమ్మించాడు. ఆ తర్వాత బదిలీలు, డిప్యుటేషన్లు, మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడం వంటి పనులు చేయించగలనంటూ నమ్మబలికాడు. అందుకు తగ్గట్టే నాలుగైదేళ్ల క్రితం వరకు సదరు ఉద్యోగి మాట సంస్థలో చలామణి అయింది. అయితే చివరకు సంస్థ ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. అయినప్పటికీ డిప్యుటేషన్లు, బదిలీలు, మెడికల్ బోర్డు వ్యవహారంపై తరచూ అవినీతి ఆరోపణలు రావడంపై దృష్టి సారించింది.
ఇతరుల సంగతేంటి?
కార్మికుల సంక్షేమం విషయంలో కార్మిక సంఘాలు గతంలో రాజీలేకుండా పని చేశాయి. కానీ గత పదేళ్లలో కారుణ్య నియామకాలు మొదలైన తర్వాత కార్మిక సంఘాల కంటే ఖద్దరు నేతల పెత్తనం పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఈ విష సంస్కృతి బదిలీలు, డిప్యుటేషన్లకు విస్తరించింది. ఎవరు పడితే వారు కాసులిస్తే చాలు సింగరేణిలో పనులు చక్కబెడతామని ప్రచారం చేసుకోవడం ప్రారంభమైంది. మొదట్లోనే ఈ విధానాలకు అడ్డుకట్ట వేయకపోవడంతో ఈ వ్యవహారం శృతి మించింది. చివరకు విజిలెన్స్తో పని కావడం లేదని ఏసీబీని రంగంలోకి దించారు. మెడికల్ బోర్డులోకి ఆర్మీ డాక్టర్ను తీసుకురావాలనే ప్రతిపాదనను పరిశీలించాల్సి వచ్చింది. అంతేకాదు.. బదిలీలు, డిప్యుటేషన్ల విషయంలో అవినీతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ అంశంపై ఆరు నెలలుగా నిర్విరామంగా దృష్టి పెట్టడంతో ఒక్కొక్కరుగా ఏసీబీకి చిక్కుతున్నారు. అయితే ప్రస్తుత విచారణ అంతా గతంలో సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి, అతని కోటరీకి సంబంధించిన సింగరేణి ఉద్యోగులు/వ్యక్తుల కేంద్రంగానే సాగుతోందనే విమర్శ ఉంది. బదిలీలు, మెడికల్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఈ కాసుల దందాతో సంబంధం ఉన్న అందరిపైనా దృష్టి సారించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. కాగా, సంస్థలో జరుగుతున్న అవినీతి వివరాలు తెలిపేందుకు ప్రత్యేకంగా 94911–44104 నంబర్ను సింగరేణి అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా వివరాలు అందించొచ్చని తెలిపారు.
ఒక్కొక్కరుగా..
లిఖిత పూర్వకంగా, ఫోన్కాల్స్, వాట్సాప్, ఈమెయిళ్ల ద్వారా అందిన సమాచారానికి తోడు సంస్థలో ఉన్నతాధికారులు ఇచ్చిన నమ్మకమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఏడాది మే 6న కొత్తగూడెంలోని మెయిన్ వర్క్షాప్లో పని చేస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావు అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు విచారించారు. తిరిగి జూన్ 6న ఇదే అంశంపై కొత్తగూడెం నివాసి, సంస్థతో సంబంధం లేకపోయినా సింగరేణి వ్యవహారాల్లో కీలకంగా మారిన ఓ మహిళనూ విచారించారు. తాజాగా భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఖని 1 ఇంక్లైన్ లో జనరల్ మజ్దూర్గా పని చేస్తున్న ఎస్. ప్రశాంత్ అనే ఉద్యోగిని ఏసీబీ విచారణ చేస్తోంది. భూపాలపల్లి విచారణలో కీలక అంశాలు లభించాయని, వాటి ఆధారంగా త్వరలో కొత్తగూడెం ఏరియాలో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉంది.