
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాహస అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: జాతీయ సాహస అవార్డులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారు అందించే జాతీయ సాహస అవార్డులు – 2024 కోసం అన్లైన్లో పోర్టల్ https:// awards. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూమి, ఆకాశం, సముద్రంపై సాహస యాత్రలు చేసిన వారిలో ఒక్కో విభాగంలో ఒకరికి అవార్డు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో సాహసం చేసి, విజయం సాధించిన యువతీ, యువకులు ఈనెల 30వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపారు. 2022 నుంచి 2024 వరకు సాహసాలు చేసిన వారి దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని వివరించారు.
సక్రమంగా విధులు నిర్వర్తించాలి
బెటాలియన్ సిబ్బందికి
డీఐజీ సన్నీ ఆదేశం
కొత్తగూడెంఅర్బన్: బెటాలియన్ పోలీసులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని బెటాలియన్స్ డీఐజీ సి.సన్నీ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ బెటాలియన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెటాలియన్ పోలీసుల విధి, విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశాక ఆవరణలో మొక్కలు నాటారు. శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన నేత్ర పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు డి.శ్రీనివాసరావు, హెచ్.అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
నియోనాటల్ వాహనంలో అధునాతన పరికరాలు
నేలకొండపల్లి: అధునాతన పరికరాలతో కూడిన నియోనాటల్ వాహనం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్సీ వద్ద బుధవారం నియోనాటల్ వాహనంలో పరికరాల పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ జిల్లాకు తొలిసారిగా ఈ వాహనాన్ని కేటాయించగా అత్యాధునిక పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేకంగా నవజాత శిశువుల సంరక్షణకు ఈ వాహనం సమకూర్చారని చెప్పారు. కాగా, 108 అంబులెన్స్లు ఖమ్మం జిల్లాలో 21, భద్రాద్రి జిల్లాలో 28 ఉండగా, ఒక్కో వాహనంలో కనీసం నెలకు 120 ట్రిప్పుల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ అధికారి దుర్గాప్రసాద్, 108 సిబ్బంది అజీమ్, పుష్పలత పాల్గొన్నారు.

కమనీయం.. రామయ్య కల్యాణం