
గిరిజన మ్యూజియం భేష్..
‘మోటా’ ప్రత్యేకాధికారి సుభాష్
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా నాటి గుర్తులతో నిర్మించి గిరిజన మ్యూజియం బాగుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ – న్యూఢిల్లీ(మోటా) ప్రత్యేకాధికారి సుభాష్ అన్నారు. భద్రాచలం డివిజన్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియాన్ని సందర్శించి కళాఖండాలు, పెయింటింగ్లు, గిరిజన వంటకాలను ఆస్వాదించారు.
అనంతరం మాట్లాడుతూ.. పర్యాటకులకు కనువిందు కలిగేలా ట్రైబల్ మ్యూజియం రూపొందించడం హర్షణీయమని అన్నారు. జిల్లాలో రెండు రోజులు పర్యటించి దేవాలయాలతో పాటు మ్యూజియాన్ని సందర్శించడంతో మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజనులకు సక్రమంగా అందిస్తున్న ఐటీడీఏ అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పీఓ బి.రాహుల్, ఏపీఓ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు ఉన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
సీఐపై సస్పెన్షన్ వేటు ?
ఇల్లెందు: ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్లోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎన్ఆర్ఐ ఒకరు కేసు విషయమై సదరు సీఐతో ఇటీవల ఫోన్లో మాట్లాడగా దురుసుగా బదులిచ్చినట్లు సమాచారం. దీంతో సదరు ఎన్ఆర్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈమేరకు సీఐని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం