
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
దుమ్ముగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మారుమూల ప్రాంతాల ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. నర్సాపురంలో మంగళవారం నిర్వహించిన ధర్తీ ఆబాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన సదస్సులో వారు మాట్లాడారు. గిరిజనులు ఆయా సంక్షేమ పథకాలు పొందాలంటే వ్యక్తిగత గుర్తింపు కార్డులు అవసరమని, వివిధ రకాల గుర్తింపు కార్డులు అందించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్, కేవైసీ, రేషన్ కార్డులతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలను గ్రామ సభల్లోనే పొందొచ్చని చెప్పారు. ఆహార నియమాలు పాటించకపోవడంతో ఎక్కువ మంది సికిల్సెల్ అనీమియా వ్యాధితో బాధ పడుతున్నారని, ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా ఇలాంటి వ్యాధులకు రూ.5లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఈఓ సమ్మయ్య, ఆర్ఐ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుభాష్, ఏఓ నవీన్ కుమార్, ఐకేపీ ఏపీఎం హేమంతిని, ఏపీఓ సుకన్య తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఆదర్శంగా నిలవాలి
భద్రాచలంటౌన్ : ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని పీఓ రాహుల్ అన్నా రు. గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ కాలేజీలో సీటు సాధించిన దుమ్ముగూడెం మండలం లింగాపురం గ్రామానికి చెందిన కాక జోగారావుకు మంగళవారం ఆయన రూ. 47 వేల చెక్కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మణిపూర్లో సీటు సాధించిన జోగారావుకు ఉన్నత చదువుల కోసం ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఎమ్మెస్సీ చదువుతూ స్పోర్ట్స్ కోచింగ్ తీసుకొని జాతీయస్థాయిలో ఎనిమిదో ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడని అభినందించారు.