
అర్హులందరికీ బియ్యం
● మూడు నెలలకు 16,773 మెట్రిక్ టన్నులు అవసరం ● రేషన్ షాపులకు చేరిన బియ్యం 16,258 మె.టన్నులు ● 2,41,760 కార్డులకు పూర్తయిన పంపిణీ ● కొన్నిచోట్ల కొనసాగుతున్న సరఫరా
కొత్తగూడెంఅర్బన్: వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యాని ఈనెల 1 నుంచి సరఫరా చేస్తోంది. ఈనెల 30 వరకు అర్హులందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. అయితే కొన్ని దుకాణాల్లో మూడు నెలల స్టాక్ నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో బియ్యం అయిపోగానే మళ్లీ పంపించేలా ఏర్పాట్లు చేశారు.
81.34 శాతం పూర్తి..
జిల్లాలో 2,97,189 రేషన్కార్డులు ఉండగా ఇప్పటికే 2,41,760 కార్డులవారికి బియ్యం పంపిణీ చేశామని, 81.34 శాతం ప్రక్రియ పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణి తెలిపారు. మూడు నెలల కోటా 16,773 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 16,258 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు చేరాయని, మరో 515 మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈనెలాఖరు లోగా అవికూడా పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అయితే క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బియ్యం స్టాక్ లేక లబ్ధిదారులు మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుండగా, ఇంకో చోట సరఫరాలో జాప్యం జరుగుతోంది.
● బియ్యం లేక షాప్ మూత..
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ఒక రేషన్ షాపులో బియ్యం నిల్వలు లేక దుకాణాన్ని మూసివేశారు. మండలంలో మొత్తం 21 రేషన్ షాపులు ఉండగా మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించడంతో అధికారులు పూర్తి స్థాయిలో బియ్యం నిల్వ ఉంచారు. కానీ, మెడికల్ కాలనీలోని 19వ నంబర్ షాపులో బియ్యం లేక డీలర్ షాపునకు తాళం వేశాడు. దీంతో లబ్ధిదారులు వేరే దుకాణానికి వెళ్లాల్సివచ్చింది. కాగా, మంగళవారం పట్టణంలో విద్యుత్ కోత ఉండడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక చాలా రేషన్ షాపులను మూసివేశారు.

అర్హులందరికీ బియ్యం

అర్హులందరికీ బియ్యం