
ఎమ్మెల్యే కాన్వాయ్ ఎదుట రైతుల నిరసన
చండ్రుగొండ: స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాన్వాయ్ని మొక్కజొన్న రైతులు అడ్డుకున్నారు. బుధవారం ఆయన మండల పర్యటనకు రాగా, తమకు న్యాయం చేయాలంటూ పోలకగూడెం గ్రామ రైతులు అడ్డగించారు. తమ గ్రామంలో 20 మంది రైతులు ఓ ప్రైవేట్ కంపనీ వద్ద మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామని, అవి నకిలీవి కావడంతో పంట దిగుబడి రాలేదని అన్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కంపెనీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా, బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే పోలీసులు వారిని పక్కకు నెట్టివేసి ఎమ్మెల్యే కాన్వాయ్ని పంపించారు.
అక్రమ నిర్మాణాన్ని కూల్చిన సింగరేణి అధికారులు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధి సంజయ్నగర్లో సింగరేణి పంప్హౌస్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న గదిని సింగరేణి ఎస్టేట్స్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందితో బుధవారం కూల్చివేయించారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు సింగరేణి అధికారులకు సమాచారం అందించగా ఈ మేరకు చర్యలు చేపట్టారు.
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
టేకులపల్లి: జిల్లాలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకె శేఖర్రావు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫాలశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదాముల్లో బియ్యం తూకం వేసి లోడ్ వేయాలని, షాపులో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని గోడౌన్లకు తరలించాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రామా, కోశాధికారి బి.బాలు, ప్రచార కార్యదర్శి వి. వెంకటేష్, టేకులపల్లి మండల అధ్యక్షుడు ఎ.సంతులాల్ పాల్గొన్నారు.
ఘనంగా పీటీఎం సమావేశాలు
టేకులపల్లి: పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చివరి రోజైన బుధవారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పీటీఎంలు ఏర్పాటు చేయగా తల్లిదండ్రుల సలహాలు, సూచనలు నమోదు చేసుకున్నారు. రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్న, చదువులో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల రైటింగ్ స్కిల్స్ మెరుగు పర్చేందుకు కలెక్టర్ తరఫున అందించిన తెలుగు, ఇంగ్లిష్ కాపీ రైట్ నోట్ పుస్తకాలను 3, 4, 5 తరగతుల విద్యార్థులకు అందజేశారు.
ఆటో బోల్తా.. మహిళ మృతి
నేలకొండపల్లి: ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. మండలంలోని శంకరగిరితండాకు చెందిన వ్యవసాయ కూలీలు ముదిగొండ మండలం మాధాపురంలో మిర్చి తోట ఏరేందుకు కొద్దిరోజులుగా వెళ్తున్నారు. బుధవారం కూడా పని ముగిశాక వారు వస్తున్న ఆటోలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో మాధవి(25)కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా చికిత్స చేయించి ఖమ్మం తరలించగా మృతి చెందింది.
చెరువులో వ్యక్తి గల్లంతు
తల్లాడ: మండలంలోని ముద్దునూరు చెరువులో బుధవారం పడి రిటైర్డ్ ఉద్యోగి గల్లంతయ్యాడు. సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన గ్రామ వాసి కాకర్ల అప్పారావు(63) తన గేదె, దూడ మేత కోసం పొలంలో ఉండగా తీసుకొచ్చేందుకు వెళ్లాడు. సమీపంలోని చెరువులోకి గేదె, దూడ దిగి లోతులోకి వెళ్తుండగా అప్పారావు దూడను బయటకు తీసుకొచ్చే క్రమాన ఆయన ఊబిలో కూరుకుని గల్లంతయ్యాడు. ఈమేరకు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

ఎమ్మెల్యే కాన్వాయ్ ఎదుట రైతుల నిరసన

ఎమ్మెల్యే కాన్వాయ్ ఎదుట రైతుల నిరసన