తాడేపల్లి రూరల్(మంగళగిరి): తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆశ్రమం రోడ్డులో రెడ్ల సత్రం వద్ద సగం కాలిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. తాడేపల్లి సీఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలి మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతకగా మృతిచెందిన మహిళ ఫోన్తో పాటు బంగారు ఆభరణాలు లభించాయి. మృతిచెందిన మహిళ విజయవాడ కండ్రికకు చెందిన మాలకొండ మహేశ్వరి (44)గా గుర్తించారు. బంధువులు పోలీసులకు అందించిన సమాచారం మేరకు.. గత శనివారం సింగ్నగర్లో తను పనిచేస్తున్న కూరగాయల మార్కెట్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కుమార్తె సింధూర లక్ష్మికి ఫోన్ చేసి స్విచ్చాఫ్ చేసింది. వెంటనే కుమార్తె బంధువుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో నున్న పోలీస్స్టేషన్తో తన తల్లి కనిపించడం లేదంటూ కుమార్తె ఫిర్యాదు చేసింది. పోలీసులు మాలకొండ సింధూర లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహం విషయాన్ని తాడేపల్లి పోలీసులు డీఎస్పీ మురళీకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
అనుమానాస్పదంగానే..
ఇదిలా ఉండగా మృతదేహం తీరు.. ఘటనా స్థలం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. మృతిచెందిన మల్లేశ్వరి ఆశ్రమం రోడ్డులోకి ఎలా వచ్చింది.. పెట్రోల్ ఎక్కడ కొన్నది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమం రోడ్డులో క్రిస్టియన్ శ్మశాన వాటిక గోడపక్కనే కంకర గుట్టపై తగలబడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె వేసుకున్న చెప్పులు అదే ప్రాంతంలో విడివిడిగా దూరంగా పడి ఉన్నాయి. మహిళ ఒంటిపై ఉన్న మంగళసూత్రం, తాడు, చెవి దుద్దులు, ఫోన్ ఒక కవరులో పక్కన పెట్టిన ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే ఎవరైనా మహిళను వేధించి పెట్రోల్ పోసి తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగలబడిన ప్రాంతం నుంచి సుమారు 50 అడుగుల దూరంలో మృతదేహం వెల్లికిలా పడి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ మృతిచెంది ఉంటే తగలబడినట్లు ఆనవాళ్లు అయినా ఉండాలి. అలాంటి గుర్తులు ఏమి కనిపించడం లేదు. మృతదేహం పూర్తిగా పురుగులు పట్టి ఉండడంతో స్పష్టంగా ఏం జరిగిందనేది పోలీసులు కూడా నిర్ధారించలేకపోతున్నారు. పైకి ఆత్మహత్య అని చెబుతున్నా వారికి పలు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం వద్ద పెట్రోల్ బాటిల్ కానీ, అగ్గిపెట్టె కానీ లభించలేదు. తన కుమార్తెతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా శరీరం అంతా మంటగా ఉందని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసిందని నున్న పోలీసులు తెలిపారు. పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకున్న తరువాత కుమార్తెకు ఫోన్ చేస్తే ఆ మంటలకు ఆమె ఫోన్, ఆభరణాలు క్యారీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? కనీసం ఆ వస్తువులు కాలినట్లు కూడా కనిపించడం లేదు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే మద్యం మత్తులో ఉన్న వారు ఏమైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతం తగలబడిన మృతదేహం ఆనవాళ్లు కూడా అక్కడ పెద్దగా కనిపించడం లేదు. చిన్నచిన్న కాలిపోయిన గుడ్డముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఘటనా స్థలం వద్ద పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆ మహిళ ఆత్మహత్యా లేదా హత్యా అన్నది నిర్ధారించాల్సి ఉంది. జరిగిన ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఏం జరిగిందనే వివరాలు బయటకు వస్తాయి.


